
హైదరాబాద్: విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కొద్దిరోజుల క్రితం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అంబేద్కర్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అంబేద్కర్ను ఏసీబీ కస్టడీకి కోరింది. బహిరంగ మార్కెట్ ప్రకారం 100 కోట్ల అక్రమాస్తులను విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ కూడబెట్టినట్టు ఏసీబీ తనిఖీల్లో వెల్లడైంది.
ప్రభుత్వ అధికారిగా ఉంటూనే ప్రైవేట్ సంస్థను స్థాపించి అంబేద్కర్ ఆ సంస్థకు డైరెక్టర్గా వ్యవహరిస్తున్నాడని ఏసీబీ విచారణలో తేలింది. అంతార్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని అంబేద్కర్ రెండు సంవత్సరాల క్రితం స్థాపించాడు. అంబేద్కర్ బినామీ ఇంట్లో రికార్డు స్థాయిలో 2 కోట్లకు పైగా నగదు లభ్యం అయిన ఘటన ఏసీబీ అధికారులనే విస్తుపోయేలా చేసింది.
సంగారెడ్డి జిల్లా బీరంగూడలోని అంబేద్కర్ బంధువు సతీశ్ ఇంట్లో రూ.2.18 కోట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన ఇంట్లో స్వాధీనం చేసుకున్న డబ్బు అంబేద్కర్కు చెందినదేనని కన్ఫామ్ చేశారు. సతీశ్తో పాటు కొంత మంది ఉద్యోగుల బంధువులు, స్నేహితులు కూడా అంబేద్కర్కు బినామీలుగా ఉన్నట్లు గుర్తించారు.
Also Read : ఖమ్మంలో ఇందిరమ్మ ఇండ్ల స్థలాలకు శంకుస్థాపన
ఎలక్ట్రిసిటీ ఏడీఈ ఇరుగు అంబేద్కర్కు సంబంధించిన ఆదాయానికి మించి ఆస్తుల కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన కింది స్థాయి ఉద్యోగులకు అంబేద్కర్ తరచూ అవినీతి పాఠాలు నేర్పించేవారని తేలింది. శేరిలింగంపల్లిలో అధునాతనమైన భవనం, సిటీలో 6 ఇంటి స్థలాలు, హైదరాబాద్ శివారులో ఒక ఫామ్హౌస్ ఏడీఈ అంబేద్కర్ అక్రమాస్తులు కూడబెట్టి కట్టినవేనని ఏసీబీ దర్యాప్తులో వెల్లడైంది.