మీరే కారణం.. కాదు మీరే: రాజ్ భవన్ vs కర్నాటక సర్కార్‎గా మారిన బెంగుళూర్ తొక్కిసలాట వివాదం

మీరే కారణం.. కాదు మీరే: రాజ్ భవన్ vs కర్నాటక సర్కార్‎గా మారిన బెంగుళూర్ తొక్కిసలాట వివాదం

బెంగుళూర్: ఆర్సీబీ విక్టరీ పరేడ్ సందర్భంగా బెంగుళూర్‎లోని చినస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఇష్యూ రాజ్ భవన్ వర్సెస్ కర్నాటక సర్కార్‎గా మారింది. తొక్కిసలాటకు మీరే కారణమంటే లేదు మీరేనంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. మొత్తానికి తొక్కిసలాట ఘటనపై రాజ్ భవన్, కర్నాటక ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఐపీఎల్‎లో తొలి టైటిల్ గెలిచిన ఆర్సీబీ ఆటగాళ్లను సన్మానించేందుకు విధాన సౌధలో నిర్వహించిన ప్రోగానికి సీఎం సిద్ధరామయ్యే గవర్నర్‎ను ఆహ్వానించారని రాజ్ భవన్ వెల్లడించింది.

సన్మాన సభను రాజ్ భవన్ నుంచి విధాన సౌధకు రాష్ట్ర ప్రభుత్వమే మార్చిందని.. తొక్కిసలాట ఘటనకు రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యతని రాజ్ భవన్ ఆరోపించింది. తొక్కిసలాటపై రాజ్ భవన్ జారీ చేసిన ప్రకటనను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. విధాన్‌ సౌధలో జరిగిన కార్యక్రమాన్ని తాము ఏర్పాటు చేయలేదని.. రాజ్ భవన్ తప్పుడు ప్రకటనలు జారీ చేస్తోందని సిద్ధరామయ్య సర్కార్ అసహనం వ్యక్తం చేసింది. సన్మాన సభకు కర్నాటక క్రికెట్ అసోసియేషనే గవర్నర్‎ను ఆహ్వానించిందని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. మొత్తానికి తొక్కి సలాట ఇష్యూ.. రాజ్ భవన్ వర్సెస్ విధాన సౌధగా టర్న్ తీసుకుంది. 

18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఆర్సీబీ ఎట్టకేలకు ఐపీఎల్ టైటిల్ సాధించిన విషయం తెలిసిందే. 2025, జూన్ 3న జరిగిన ఫైనల్ మ్యాచులో పంజాబ్‎ను చిత్తు చేసి.. ఎన్నో ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్నా ఐపీఎల్ టైటిల్‎ను ఆర్సీబీ దక్కించుకుంది. 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెలవడంతో జట్టు ఆటగాళ్లను సత్కరించేందుకు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (కెఎస్‌సిఎ) బుధవారం (జూన్ 4) చినస్వామి స్టేడియంలో ప్రత్యేక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది. 

ఈ క్రమంలో ఆర్సీబీ ఆటగాళ్లను చూసేందుకు ఫ్యాన్స్ స్టేడియం వద్ద తండోపతండాలు ఎగబడ్డారు. స్టేడియం కెపాసిటీ 30 వేలు ఉంటే.. దాదాపు 3 లక్షల మంది వరకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగి.. 11 మంది మరణించారు. 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనను సుమోటోగా తీసుకున్న కర్నాటక హైకోర్టు.. కేసు నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని.. అందుకు సంబంధించిన నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.