- నెలరోజులుగా రాష్ట్ర బీజేపీలో అసంతృప్తి సెగలు
- పార్టీ లైన్ దాటి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న లీడర్లు
- తాజా మార్పులు, చేర్పులతోనైనా వివాదాలకు తెర పడేనా?
- కొత్త అధ్యక్షుడు కిషన్రెడ్డి ముందు పెద్ద టాస్క్
హైదరాబాద్, వెలుగు : నెల రోజులుగా రాష్ట్ర బీజేపీలో కొనసాగుతున్న పరిణామాలకు పార్టీ జాతీయ నాయకత్వం ఎట్టకేలకు తెర దింపింది. అందరూ ఊహించినట్లే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించింది. రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి బండి సంజయ్ని తప్పించింది. గాడి తప్పిన పార్టీ లీడర్లందరూ ఈ మార్పులతో ఒక్కతాటిపైకి వస్తారా? గ్రూపులుగా విడిపోయిన లీడర్లు ఐక్యతారాగం ఆలపిస్తారా? అనేది ఆసక్తి రేపుతున్నది. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్రెడ్డి రాష్ట్ర పార్టీలో సీనియర్. గతంలో రెండుసార్లు పార్టీ అధ్యక్షుడిగా పని చేసిన అనుభవముంది. మూడోసారి వచ్చిన చాన్స్ను ఆయన ఎలా వినియోగించుకుంటారు.. ఎన్నికలు ముంచుకొస్తున్న టైమ్ కావటంతో పార్టీని ఎలా ముందుకు నడిపిస్తారనే ఉత్కంఠ కేడర్లో నెలకొంది.
కిషన్రెడ్డికి పార్టీలో సౌమ్యుడనే ముద్ర ఉంది. కొద్దిరోజులుగా బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని, బీజేపీకి బీఆర్ఎస్ బీటీమ్అనే విమర్శలు సూటిగా కమలం పార్టీని వెంటాడుతున్నాయి. ఈ టైమ్లో కిషన్రెడ్డి వీటిని ఎలా అధిగమిస్తారు? ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తారు? ఇతర పార్టీ నుంచి వచ్చిన లీడర్లను కలగలుపుకుపోతారా? సొంత పార్టీ గ్రూపులను ఆయనెలా హ్యాండిల్ చేస్తారనే కోణంలో చర్చలు జోరందుకున్నాయి.
కవిత ఎపిసోడ్ నుంచి కలహాలు
లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ నుంచి బీజేపీ జాతీయ నాయకత్వం అనుసరిస్తున్న తీరు రాష్ట్రంలో ఆ పార్టీని ఇరుకునపడేసింది. ఆ ఇష్యూపై రాష్ట్ర నేతలందరూ జాతీయ నాయకత్వంపై అసంతృప్తి వెలిబుచ్చారు. కవితను అరెస్ట్ చేయకపోవటంతో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని ప్రచారం జరుగుతున్నదని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి ట్వీట్ చేయటం అప్పట్లో చర్చనీయాంశమైంది. బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి బహిరంగంగా గళమెత్తటం హాట్ టాపికైంది. ఈటల రాజేందర్ కూడా పలుమార్లు మీడియా చిట్చాట్లో మాట్లాడుతూ పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని టార్గెట్ చేశారు. కేసీఆర్ను ఓడించే లక్ష్యంతోనే బీజేపీలో చేరానని, ఇప్పుడున్న పరిస్థితిలో బీజేపీతో సాధ్యమయ్యేలా లేదని కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పలుమార్లు విరుచుకుపడ్డారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన లీడర్లకు ప్రాధాన్యం లేదని.. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావాలంటే సంజయ్ను మార్చాలని ఈటల, రాజగోపాల్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్షాకు ఫిర్యాదు చేశారు.
ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నాగర్కర్నూల్ పర్యటనకు వచ్చిన సందర్భంగా, రెండు రోజుల కిందట ఢిల్లీలో పార్టీ ఎమ్మెల్యే రఘునందన్రావు తన అసంతృప్తి వెలిబుచ్చారు. దుబ్బాకలో తన విజయమే బీజేపీకి టర్నింగ్ పాయింట్ అయిందని, తనకు మాత్రం పార్టీలో తగిన గుర్తింపు లేదన్నారు. బండి సంజయ్పై పలు ఆరోపణలు చేయటంతో పాటు అధిష్ఠానంపై సంచలన కామెంట్లు చేశారు. అప్పటికే పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని దున్నపోతుతో పోలుస్తూ ట్వీట్ చేసిన మాజీ ఎంపీ జితేందర్రెడ్డి.. ఈటలతో లంచ్ భేటీ కావటం రాష్ట్ర కేడర్లో కలకలం రేపింది. మరోవైపు సంజయ్ను అధ్యక్ష పదవి నుంచి తప్పించటం ఆత్మహత్య సదృశమేనని మాజీ మంత్రి విజయరామారావు ట్వీట్ చేశారు. సంజయ్ను పార్టీ పదవి నుంచి తొలగించే అపోహలన్నీ మీడియా ప్రచారమేనని మాజీ ఎంపీ విజయశాంతి కొట్టిపారేశారు. రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్సీ రాచందర్రావు, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్రెడ్డి.. సంజయ్కు అండగా నిలిచారు.
నెల రోజులుగా వరుసగా జరిగిన ఈ పరిణామాలన్నీ పార్టీ లీడర్ల మధ్య అనైక్యతను బట్టబయలు చేశాయి. ఇంత జరుగుతున్నా పార్టీ జాతీయ నాయకత్వం సైలెంట్గా ఉండటం బీజేపీ గ్రాఫ్ను మరింత దిగజార్చిందనే అభిప్రాయాలున్నాయి. వీటన్నింటినీ గాడిలో పెట్టేందుకే పార్టీ అధిష్ఠానం తాజాగా పదవుల మార్పు నిర్ణయం తీసుకుందనే వాదనలున్నాయి. అవి ఏమేరకు ఫలితాన్నిస్తాయి.. వచ్చే ఎన్నికల దిశగా పార్టీకి ఊపునిస్తాయా.. లేదా వేచిచూడాల్సిందే.
పార్టీ లైన్ దాటి..
మునుగోడు ఉప ఎన్నికకు ముందు రాష్ట్రంలో జోరుమీదున్న బీజేపీ.. సొంత పార్టీ లీడర్ల గ్రూపులతో నెల రోజులుగా ఢీలా పడింది. ఆ పార్టీ ముఖ్య నేతలు ఒకరిపై ఒకరు బాహాటంగా విమర్శలు చేసుకోవటంతోపాటు బహిరంగంగా ఆరోపణలు చేసుకున్నారు. క్రమశిక్షణకు పెట్టింది పేరైన బీజేపీలో పార్టీ లైన్ దాటి లీడర్లు ఎవరికి తోచినట్లు వాళ్లు మాట్లాడటం.. ఏకంగా అధిష్ఠానానికి సవాల్ విసిరేంత వరకు వెళ్లింది. బీజేపీ అధిష్ఠానం రాష్ట్రంలో సెమీఫైనల్గా భావించిన మునుగోడు ఎన్నికలో ఆ పార్టీకి విజయం త్రుటిలో చేజారింది. కాంగ్రెస్కు రాజీనామా చేసి పార్టీలో చేరిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిని ఓడిచేందుకు అధికార పార్టీ బీఆర్ఎస్ శక్తియుక్తులన్నీ ఒడ్డింది. అంతకు ముందు ఎన్నికలతో పోలిస్తే బీజేపీ ఓటు బ్యాంక్ ఒక్కసారిగా పది రెట్లకు..గణనీయంగా 87 వేలకు పెరిగింది. అంత జోష్ను ప్రచారం చేసుకోవటంలో పార్టీ ఫెయిలైంది.
కాంగ్రెస్ నుంచి పార్టీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ప్రాధాన్యం పెరిగిపోతుందని సొంత పార్టీలోనే కొందరు సహాయనిరాకరణ చేసినట్లు ప్రచారం జరిగింది. ఈ ఎన్నిక తర్వాత ఓటమికి ఒకరంటే ఒకరు కారణమంటూ.. నేతలు తప్పులను లెక్కపెట్టారు. ఇటీవల కర్నాటక ఎన్నికల ఫలితాలు ఒక్కసారిగా బీజేపీ చాప కింద నీళ్లు తెచ్చాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్కు అనుకూలంగా కొందరు, వ్యతిరేకంగా కొందరు మాట్లాడటం మొదలుపెట్టారు. దీంతో లీడర్ల మధ్య సమన్వయ లోపం బట్టబయలైంది. .