హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ కిట్లలో ఎక్స్పైరీ అయిన వస్తువులు పంపిణీ అవుతున్నాయి. వాటినే బాలింతలకు అందజేస్తున్నట్టు ఫిర్యాదులు అందుతున్నాయి. రెండ్రోజుల క్రితం హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఓ బాలింతకు ఇచ్చిన కిట్లో అన్ని వస్తువులూ ఎక్స్పైరీ అయినవే ఉన్నాయి. ఇంటికెళ్లిన తర్వాత ఎక్స్పైరీ డేట్ చూసి కంగుతిన్న కుటుంబ సభ్యులు, తిరిగి వాటిని హాస్పిటల్కు తీసుకొచ్చి ఇచ్చారు. ఇందులో 2020 ఆగస్టులో ఎక్స్ పైర్ అయిన బేబీ పౌడర్, 2021 ఆరో నెలలో ఎక్స్పైరీ అయిన బేబీ ఆయిల్, అదే ఏడాది ఏడో నెలలో ఎక్స్పైర్ అయిన బేబీ సోప్స్, తొమ్మిదో నెలలో ఎక్స్పైరీ అయిన బేబీ షాంపు ఉన్నాయి. దీంతో మెడికల్ ఆఫీసర్లు గుట్టుచప్పుడు కాకుండా ఆ వ్యక్తికి మరో కిట్ ఇచ్చి పంపించినట్టు తెలిసింది. ఈ వ్యవహారాన్నిలైట్ తీసుకోవాలని చెప్పారని.. విషయం బయటకు తెలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించినట్టు సమాచారం. కేసీఆర్ కిట్ల కొనుగోలు, పంపిణీపై అధికారుల పర్యవేక్షణ కొరవడడం వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని హాస్పిటళ్ల సూపరింటెండెంట్లు చెబుతున్నారు. కరోనా సమయంలో కొన్ని వేల కిట్లు స్టోరేజీ సెంటర్లలోనే ఎక్స్పైర్ అయ్యాయని, కిట్లు లేవని తాము సమాచారం ఇచ్చినా ఉన్నతాధికారులు పట్టించుకోలేదని పేర్కొంటున్నారు.
ముగిసిన కాంట్రాక్ట్
ప్రభుత్వ దవాఖాన్లలో డెలివరీల సంఖ్యను పెంచాలన్న ఉద్దేశంతో 2017లో కేసీఆర్ కిట్ స్కీమ్ను ప్రారంభించారు. ఈ కిట్లో తల్లి, బిడ్డకు ఉపయోగపడేలా సబ్బులు, దోమ తెర, బేబీ ఆయిల్, బేబీ బెడ్, చీర, హ్యాండ్ బ్యాగ్, టవల్, న్యాప్కిన్స్, డైపర్స్, షాంపూ తదితరాలు ఉంటాయి. ఇందులో ఎక్కువగా జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ప్రొడక్టులే వాడుతున్నారు. మొదట్నుంచీ ఈ కిట్ల సప్లైని ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్నారు. కాంట్రాక్ట్ గడువు ముగిసి 3 నెలలు కావొస్తోంది. ప్రస్తుతం అన్ని వస్తువుల ధరలు పెరగడం, ప్రభుత్వం కిట్కు ఇచ్చే ధరలను పెంచకపోవడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో టెండర్లు పిలిచినా ఒక్కరు కూడా టెండర్ దాఖలు చేయలేదు. దీంతో ఇటీవలే మరోసారి టెండర్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
మా దృష్టికి రాలేదు
ఎక్స్పైరీ అయిన కిట్ల పంపిణీ జరిగినట్టు మా దృష్టికి రాలేదు. ఎక్స్పైరీ అయిన వస్తువులు హాస్పిటల్ వరకూ వెళ్లే అవకాశం ఉండదు. కిట్లోని వస్తువుల ఎక్స్పైరీ తేదీలన్నీ ఆన్లైన్లో ఉంటాయి. ఎక్స్పైరీకి దగ్గరలో ఉన్న వస్తువులను స్టోరేజీ సెంటర్ నుంచే వెనక్కి పంపించి, కొత్తవి తెప్పిస్తాం. హాస్పిటళ్లకు 2 నెలలకు సరిపడా స్టాక్ ఒకేసారి ఇస్తాం. కరోనా వల్ల నిజామాబాద్, ఆదిలాబాద్, సూర్యాపేట జిల్లాల్లోని స్టోరేజీ సెంటర్లో 2 వేల బేబీ సోప్స్ ఎక్స్పైర్ అయ్యాయి. వాటిని వెనక్కి పంపించాం.
- చంద్రశేఖర్రెడ్డి, ఎండీ, టీఎస్ఎంఎస్ఐడీసీ