- ఆర్మూర్ నుంచి 7 ఆర్టీసీ స్పెషల్ బస్సులు తెప్పించి స్వస్థలాలకు 481 మంది తరలింపు
- మరో 37 మంది ఆర్మూర్ ప్రభుత్వ షెల్టర్ హోమ్కు
- వెట్టిచాకిరీ చేయిస్తున్న ముగ్గురిపై క్రిమినల్ కేసులు, బట్టీలు సీజ్.. తలెత్తుకోలేని రేకుల షెడ్లలో బస
- గర్భిణులు, బాలింతలు, మైనర్లతోనూ పనులు
- కూలీలు.. వారి కుటుంబాల పరిస్థితి చూసి చలించిన జడ్జి
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని ఇటుకబట్టీల్లో వెట్టి చాకిరీ చేస్తున్న 102 కుటుంబాలకు జిల్లా జడ్జి భరతలక్ష్మి విముక్తి కల్పించారు. భరించలేని ఎండల్లో నిర్బంధంగా పనిచేయిస్తున్న ఇటుకబట్టీ ఓనర్ ఆగడాలు భరించలేక ఓ బాధితుడు ఎన్జీవో సహాయంతో తెలంగాణ స్టేట్లీగల్సర్వీస్ అథారిటీని ఆశ్రయించాడు. అథారిటీ సమాచారం మేరకు నిజామాబాద్ జిల్లా జడ్జి భరతలక్ష్మి మంగళవారం మధ్యాహ్నం స్వయంగా ఆర్మూరు ఏరియాలోని మగ్గిడి, దేగామల్లో ఇటుక బట్టీలను సందర్శించారు. ఆమె ఆదేశాలతో ఆయా శాఖల అధికారులు బుధవారం అక్కడికి చేరుకుని కార్మికులను రెస్క్యూ చేశారు.
వారిని బెదిరించి పని చేయిస్తున్న ముగ్గురిపై ఆర్మూర్పోలీసులు క్రిమినల్కేసులు నమోదు చేయగా.. మూడు ఇటుకబట్టీలను తహసీల్దార్ సత్యనారాయణ సీజ్చేశారు. ఈ ప్రాంతంలో మిగతా బట్టీల్లో పరిస్థితులను సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ పరిశీలిస్తున్నారు. బాధితుల్లో కూలీలు, వారి కటుంబసభ్యులు కలిసి మొత్తం 518 మంది ఉన్నారు. వారంతా ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందినవారని గుర్తించారు. ఆర్మూర్నుంచి 7 ఆర్టీసీ స్పెషల్బస్సుల్లో పోలీస్ ఎస్కార్ట్ మధ్య 481 మందిని బుధవారం నెల్లూరుకు తరలించారు. ఆర్మూరులో ఏర్పాటు చేసిన షెల్టర్లో ఉన్న మరో 37 మందిని గురువారం పంపనున్నారు. కార్మికులు, కుటుంబసభ్యుల తరలింపు ప్రక్రియను నెల్లూరు, నిజామాబాద్ జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో రెవెన్యూ, పోలీస్, లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు చేపట్టారు.
రేకుల షెడ్లలో బస.. గర్భిణులు, బాలింతలు, మైనర్లతోనూ పనులు
ఆర్మూర్ప్రాంతంలోని మగ్గడి, దేగామ్లోని ఇటుకబట్టీల ఓనర్లు ఒక్కొక్కరికి రూ.70 వేల నుంచి రూ.లక్ష అడ్వాన్స్చెల్లించి ఏపీలోని నెల్లూరుజిల్లా నుంచి కూలీలను రప్పించారు. నిరుడు అక్టోబర్లో పిల్లాపాపలతో 102 కుటుంబాలు అక్కడకు వచ్చాయి. ఆరడుగుల ఇరుకైన రేకుల షెడ్లో బస ఏర్పాటు చేశారు. వెయ్యి ఇటుకలు తయారు చేస్తే రూ.వెయ్యి ఇస్తామని ఒప్పందం చేసుకున్న ఓనర్లు రూ.750 లు మాత్రమే ఇస్తున్నారు. ఎప్పటికప్పుడు పూర్తి కూలీ ఇవ్వకుండా బియ్యం, కూరగాయలకు మాత్రమే డబ్బులు ఇస్తున్నారు.
పొద్దున 4 గంటల నుంచి రాత్రి 12 గంటల దాకా పనులు చేయిస్తున్నరు. భర్తలతో పాటు భార్యలు కూడా పని చేస్తున్నారు. వీరిలో బాలింతలు, గర్భిణులు కూడా ఉన్నారు. వారి పనికి ఎలాంటి ఫలితం ఉండడంలేదు. చిన్న పిల్లలతో ఇటుకలు మొయిస్తున్నారు. భగ్గుమంటున్న ఎండల్లో పని చేయలేకపోతున్నామని, లెక్క తేల్చి డబ్బులిస్తే ఊరెళ్లిపోతామంటే కొట్టి.. బెదిరించి పనులు చేయించుకుంటున్నారు. దీంతో విసుగెత్తిన ఒక కూలీ లీగల్సెల్అథారిటీని ఆశ్రయించడంతో ఈ బాగోతం బయటకొచ్చింది.
ఇంత కఠినంగా ఉంటరా..?
మంగళవారం మిట్టమధ్యాహ్నం మగ్గిడి, దేగామ్ ఇటుక బట్టీల వద్దకు వెళ్లిన జిల్లా జడ్జి భరతలక్ష్మీ అక్కడ కూలీల పరిస్థితి చూసి కదిలిపోయారు. చెమటలో తడిసి.. పని చేయలేక నిస్సహాయంగా ఉన్న మహిళలు, పిల్లలను చూసి చలించిపోయారు. ఓనర్లు ఇంత కఠినంగా ఉంటారా అని ఆశ్చర్యపోయారు. అప్పటికప్పుడు కలెక్టర్ఇలా త్రిపాఠితో మాట్లాడి 518 మంది కోసం విజయలక్ష్మీగార్డెన్లో షెల్టర్, భోజనాలు ఏర్పాటుచేయించారు. లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన 7 స్పెషల్బస్సుల్లో 481 మంది నెల్లూరుకు తరలివెల్లారు. అక్కడి అధికారులు నిత్యావసర సరుకులు అందించి లోకల్గా పనులు కల్పించనున్నట్టు చెప్పారు.
నిర్బంధం, బాల కార్మిక, జువైనల్ కేసులు నమోదు
జిల్లా జడ్జి భరతలక్ష్మీ ఆదేశాలతో మగ్గిడి, దేగామ్ ఇటుకబట్టీలను ఆర్మూర్ తహసీల్దార్ సత్యనారాయణ సీజ్చేశారు. కూలీల నిర్బంధం, బాలకార్మిక చట్టం, జువైనల్యాక్ట్కింద ఇటుకబట్టీ ఓనర్లు తిరుపతిరెడ్డి, కిరణ్, మధుసూదన్రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఆర్మూర్ టౌన్ సీఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు.
