హైదరాబాద్, వెలుగు: టీచింగ్ హాస్పిటల్స్లో వైద్య సేవలు మెరుగుపర్చేందుకు వీలుగా మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్లో పని విభజన చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందుకోసం ముగ్గురు అడిషనల్ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లకు త్వరలో హెడ్ ఆఫీస్లో పోస్టింగ్ ఇవ్వనున్నట్టు సమాచారం. ఈ ముగ్గురిలో ఒకరు మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉన్న హాస్పిటల్స్లో ట్రీట్మెంట్కు సంబంధించిన పనులు చూసుకోనున్నారు. ట్రీట్మెంట్ సరిగా అందించడం, ఆపరేషన్ల సంఖ్య పెంచడం, మార్నింగ్, ఈవినింగ్ ఓపీ సరిగా నిర్వహించడం, డ్యూటీ అవర్స్లో డాక్టర్లు హాస్పిటల్స్లో ఉండకపోతే యాక్షన్ తీసుకోవడం వంటివి ఈ ఆఫీసర్ పర్యవేక్షించనున్నారు.
రెండో ఏడీఎంఈకి మెడికల్ ఎడ్యుకేషన్, మెడికల్ రీసెర్చ్కు సంబంధించిన బాధ్యతలు అప్పజెప్పాలని నిర్ణయించారు. మెడికోల స్టైఫండ్, రీసెర్చ్ ప్రోగ్రాం, ప్రొఫెసర్లు క్లాసులు తీసుకునే విధంగా చర్యలు చేపట్టడం వంటివి ఈయన పర్యవేక్షిస్తారు. కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణ పనులను, రిక్రూట్మెంట్ వ్యవహారాలను మరో ఏడీఎంఈకి అప్పగించనున్నారు. ప్రస్తుతం ఈ పనులన్నింటినీ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, డాక్టర్ రమేశ్రెడ్డి ఒక్కరే పర్యవేక్షిస్తున్నారు.