మోదీ సర్కార్ రావాలని దేశం కోరుకుంటున్నది: డీకే అరుణ

మోదీ సర్కార్ రావాలని దేశం కోరుకుంటున్నది: డీకే అరుణ
  • బీజేపీకి 400 సీట్లు పక్కా

హైదరాబాద్, వెలుగు: కేంద్రంలో మళ్లీ మోదీ సర్కార్ రావాలని యావత్ దేశం కోరుకుంటున్నదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్‌‌‌‌‌‌‌‌​నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. ప్రతి గ్రామంలోనూ మోదీ నామస్మరణ వినిపిస్తున్నదన్నారు. ఆదివారం పార్టీ స్టేట్ ఆఫీసులో మహబూబ్‌‌‌‌‌‌‌‌ నగర్, నల్గొండ జిల్లాలకు చెందిన పలువురు నేతలు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, డీకే అరుణ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు

అనంతరం డీకే అరుణ మాట్లాడుతూ, ప్రజల నుంచి వచ్చే స్పందన చూస్తుంటే దేశంలో 400కుపైగా స్థానాలు, రాష్ట్రంలో 12 నుంచి 15 ఎంపీ సీట్లు గెలుస్తామన్న ధీమా కలుగుతున్నదని పేర్కొన్నారు. మోదీ పాలనను చూసి ఎంతో మంది బీజేపీలో చేరుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే మెజారిటీ స్థానాల్లో బీజేపీ గెలవాలన్నారు. రాహుల్ గాంధీకి ప్రధాని అయ్యేందుకు అర్హత ఉందా అని ఆమె ప్రశ్నించారు.

కనీసం ప్రధాని అభ్యర్థిగానైనా రాహుల్ గాంధీ పనికొస్తారా అని ఎద్దేవా చేశారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ రాకపోవడంతో ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేసిన విష్ణువర్ధన్ రెడ్డి తిరిగి బీజేపీలోకి వచ్చారు. నల్గొండ పార్లమెంట్‌‌‌‌‌‌‌‌లోని కోదాడ నియోజకవర్గానికి చెందిన ఓయూ జేఏసీ నేత అంజి యాదవ్ కూడా పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.