- డీఎం హెచ్వో తుకారం రాథోడ్
భద్రాచలం, వెలుగు : ఏజెన్సీలో గిరిజన గ్రామాల్లో ఉన్న గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని డీఎంహెచ్వో తుకారం రాథోడ్ ఆదేశించారు. స్థానిక గిరిజన అభ్యుదయ భవన్లో భద్రాచలం డివిజన్ లెవల్ వైద్య, ఆరోగ్య సిబ్బందితో ఆయన శుక్రవారం రివ్యూ నిర్వహించారు. గర్భిణులను ప్రభుత్వ ఆస్పత్రికి డెలివరీ కోసం తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. చలి పెరుగుతున్నందున సిబ్బంది పల్లెల్లో ఇంటింటికి వెళ్లి డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వైరల్ ఫీవర్లపై సర్వే నిర్వహించి, రక్తనమూనాలు సేకరించాలన్నారు.
వ్యాధి నిర్ధారణను బట్టి వారికి వెంటనే చికిత్స అందించాలని తెలిపారు. ప్రతీ గ్రామంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ఈనెల 18 నుంచి 31 వరకు ప్రతీ గిరిజన గ్రామంలో ఇంటింటికీ తిరిగి ఐసీడీసీ సర్వే ముమ్మరంగా చేపట్టాలన్నారు. ప్రతినెలా 14న తప్పనిసరిగా ప్రతీ సబ్ సెంటర్లో హెల్త్ మేళా నిర్వహించాలన్నారు.
ప్రతినెలా మూడో శనివారం జనని ఆరోగ్య సమితి కమిటీ సమావేశాలు జరిపి కార్యక్రమాలపై అవగాహన కల్పించాలని సూచించారు. మందులు నిల్వ ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీఎం హెచ్వో సైదులు, విజయలక్ష్మి, డిప్యూటీ డీఎం హెచ్వోలు శ్రీధర్, స్పందన, ఎన్వీబీడీసీ ప్రోగ్రామ్ అధికారి తేజశ్రీ తదితరులు పాల్గొన్నారు.
