
అమ్మ’ పార్టీ అన్నాడీఎంకే వెనుకబడిందా! అధికారంలో ఉండికూడా డీఎంకే కన్నా తక్కువ ఓట్లు సాధించడంలోనే… తమిళనాడు మార్పువైపు పరుగులు తీస్తున్న సంగతి అర్థమవుతుంది.తమిళనాడులో డిసెంబర్ చివరి వారంలో జరిగిన గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు జనవరి మొదటి వారంలో వచ్చాయి. స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే, దాని మిత్రపక్షాలు… రూలింగ్లో ఉన్న అన్నాడీఎంకే, దాని మిత్రపక్షాలపై పైచేయి సాధించాయి. పంచాయతీ యూనియన్ సీట్లలో 43.51 శాతం సీట్లను డీఎంకే తన ఖాతాలో వేసుకోగా అన్నాడీఎంకే 40.64 శాతం సీట్లు మాత్రమే సాధించి వెనకబడింది. సీఎం పళనిస్వామి సొంత జిల్లా సేలం సహా రూలింగ్ పార్టీకి కంచుకోట లాంటి పశ్చిమ ప్రాంతంలోని చాలా చోట్ల డీఎంకే నెగ్గటం విశేషం.
తనకు పట్టున్న సెంట్రల్, నార్త్ రీజియన్లలోని తిరుచిరాపల్లి, తిరువారూర్, తిరువన్నమలై తదితర ఏరియాల్లోని మెజారిటీ సీట్లను డీఎంకే నిలబెట్టుకుంది. సేలంలోని 29 జిల్లా సీట్లలో అన్నాడీఎంకే, డీఎంకే చెరో నాలుగు స్థానాలు, ఇతరులు రెండు సీట్లు గెలిచారు. 288 పంచాయతీ యూనియన్ సీట్లలో అన్నాడీఎంకే 71, డీఎంకే 44, ఇతరులు 51 కైవసం చేసుకున్నారు. కన్యాకుమారిలోని 11 జిల్లా సీట్లలో అన్నాడీఎంకే ఆరు, కాంగ్రెస్ ఐదు సాధించాయి.
ప్రతిపక్షాలదే పైచేయి
తమిళనాడులోని మొత్తం జిల్లాల సంఖ్య 37 కాగా, 27 జిల్లాల్లో ఎన్నికలు జరిగాయి. మొత్తం 91,975 పంచాయతీ వార్డ్ మెంబర్ పోస్టులకు; 9,624 ప్రెసిడెంట్ పొజిషన్లకు; 5,090 పంచాయతీ యూనియన్ పదవులకు; 515 జిల్లా పంచాయతీ వార్డ్ మెంబర్ సెగ్మెంట్లకి ఎలక్షన్స్ పూర్తయ్యాయి. రీసెంట్గా జరిగిన రెండు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో విజయం సొంతం చేసుకున్న అన్నాడీఎంకే పంచాయతీ ఎలక్షన్స్లోనూ ఇదే రిజల్ట్ని రిపీట్ చేస్తామనే గట్టి నమ్మకంతో ఉంది. ఊహించని విధంగా ప్రతిపక్షం ఎక్కువ సీట్లు నెగ్గటంతో షాక్కి గురైంది. ఫలితాలు ఎలా ఉన్నా ప్రజల తీర్పును స్వాగతిస్తామని అన్నాడీఎంకే కోఆర్డినేటర్, డిప్యూటీ సీఎం పన్నీర్సెల్వం చెప్పారు. లోకల్ బాడీ ఎలక్షన్స్లో అధికార పార్టీ రన్నరప్గా నిలవటాన్ని ఎదురు దెబ్బగానే భావిస్తారు. కానీ.. అధికార అన్నాడీఎంకే ఈ వాదనను తోసిపుచ్చుతోంది. లోక్సభ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన తాము ఈ ఎనిమిది నెలల్లోనే ఈ రేంజ్లో పుంజుకున్నామంటే అది ప్రజల అభిమానానికి, మద్దతుకు తిరుగులేని రుజువని ధీమాగా చెబుతోంది.