మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు రాజ్యసభ సీటు ఇవ్వాలన్న కాంగ్రెస్ రిక్వెస్ట్కు డీఎంకే నో చెప్పింది. తమిళనాడు నుంచి రాజ్యసభకు పోటీచేసే ముగ్గురు కేండిడేట్ల పేర్లను డీఎంకే ప్రకటించింది.రాష్ట్రం నుంచి ఖాళీకానున్న ఆరు రాజ్యసభ సీట్ల ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ గత నెలలోనే ప్రకటించింది. అసెంబ్లీలో పార్టీ బలాబలాలనుచూస్తే ఏఐఏడీఎంకే, డీఎంకే పార్టీలు చెరో మూడు సీట్లను గెలుచుకోనున్నాయి. అస్సాం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ పదవీకాలం ముగిసింది. మరోసారి అక్కడ నుంచి ఆయన ఎన్నికయ్యేందుకు అవసరమైన బలం కాంగ్రెస్కు లేదు. దీంతో ఒక సీటు తమకు తమిళనాడు నుంచి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డీఎంకేను కోరినట్టు వార్తలొచ్చాయి.
ఎన్నికల ఒప్పందం మేరకు.. మూడు రాజ్యసభ సీట్లకుగాను ఒక సీటును ఎండీఎంకే చీఫ్ వైకోకు కేటాయించాలని డీఎంకే ఇప్పటికే నిర్ణయించింది. పార్టీ ట్రేడ్ యూనియన్ లీడర్ ఎం. షణ్ముగం, సీనియర్ అడ్వకేట్ పి. విల్సన్ ఈనెల 18న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులుగా బరిలో ఉంటారని డీఎంకే చీఫ్ ఎం.కె.స్టాలిన్ ప్రకటించారు. దీంతో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తమిళనాడు రాజ్యసభ కోటాలో ఎన్నికయ్యేందుకు దారులు మూసుకుపోయాయి.
234 సభ్యులున్న అసెంబ్లీలో ఏఐడీఎంకేకు 123 మంది, డీఎంకేకు వందమంది సభ్యులున్నారు. డీఎంకే మిత్రపక్షమైన కాంగ్రెస్కు ఏడుగురు, ఐయూఎంలకు ఒక సభ్యుడు ఉన్నారు. ఏఎంఎంకే లీడర్ టీటీవీ దినకరణ్ ఇండిపెండెంట్గా ఉన్నారు. రాజ్యసభ ఎంపీగా గెలిచేందుకు కేండిడేట్ కు 34 ఓట్లు అవసరమవుతాయి. ఈలెక్కన ఏఐఏడీఎంకే, డీఎంకేలు చెరి మూడు సీట్లను గెలుచుకోనున్నాయి.