
న్యూఢిల్లీ: ఉగ్రవాదులు మరణిస్తే సంతాపం తెలుపుతరా? అని కొలంబియా తీరుపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పాకిస్తాన్పై దౌత్య యుద్ధంలో భాగంగా కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీలు విదేశాల్లో పర్యటిస్తున్నాయి. శశిథరూర్ నేతృత్వంలోని కమిటీ ప్రస్తుతం కొలంబియాలో పర్యటిస్తున్నది. ఈ సందర్భంగా కొలంబియా సర్కార్ తీరును శశిథరూర్ వాళ్ల దేశంలోనే ఎండగట్టారు.
‘‘ఉగ్రవాదులు మా దేశంలో దాడికి పాల్పడి సామాన్య ప్రజల ప్రాణాలు తీశారు. ఆపరేషన్ సిందూర్లో భాగంగా మా ఆర్మీ పాక్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసింది. ఉగ్రవాదులను మట్టుబెట్టింది. కానీ పాక్లో చనిపోయినోళ్లకు కొలంబియా సర్కార్ సంతాపం తెలియజేసింది. అంటే ఉగ్రవాదులు చనిపోతే సంతాపం తెలియజేస్తరా? ఉగ్రవాదులు, సామాన్య ప్రజలు ఒక్కటేనా?” అని ఆయన ప్రశ్నించారు. ఉగ్రదాడి బాధితులపై దయ చూపాల్సిందిపోయి.. ఉగ్రవాదుల విషయంలో దయ చూపుతారా? అని నిలదీశారు.