
కడుపునొప్పితో బాధపడుతున్న బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్తే.. స్కాన్ చేసిన వైద్యులకు దిమ్మతిరిగే విషయం తెలిసింది. బాలుడి కడుపులో సూదులు, ఇనుప గోర్లు, మరియు ఒక స్క్రూడ్రైవర్ కనిపించాయి. ఈ వింత ఘటన యూపీలోని ఉన్నావోలో వెలుగుచూసింది.
స్థానిక భట్వా గ్రామానికి చెందిన కరణ్ అనే 18 ఏళ్ల బాలుడు ఆదివారం తీవ్రమైన కడుపునొప్పితో లక్నో-కాన్పూర్ రహదారిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తండ్రితో కలిసి వెళ్లాడు. అక్కడ వైద్యులు కరణ్కు స్కాన్ చేయగా.. అతని కడుపులో కుట్టు మిషన్ సూదులు, మూడు ఇంచుల ఇనుప గోర్లు, మరియు ఒక స్క్రూడ్రైవర్ ఉన్నట్లు కనిపించాయి. దాంతో వైద్యులు సోమవారం మూడు గంటల పాటు శస్త్రచికిత్స చేసి.. పదునైన అంచుగల ఐరన్ ఇన్స్ట్రూమెంట్స్, దాదాపు 30 వరకు మూడు ఇంచుల ఇనుప గోర్లు, కుట్టు మిషన్లో ఉపయోగించే సూదులు, మరియు ఒక స్క్రూడ్రైవర్ను బయటకు తీశారు.
కరణ్ పరిస్థితి గురించి తండ్రి కమలేష్ మాట్లాడుతూ.. కరణ్ మానసికంగా బాధపడేవాడని తెలిపాడు. కరణ్ వాటన్నింటిని ఎప్పుడు, ఎలా మింగాడో తమకు తెలియదని కమలేష్ వైద్యులకు చెప్పాడు.
కాగా, ఆపరేషన్ నిర్వహించిన సీనియర్ డాక్టర్ రాధా రామన్ అవస్థీ మాట్లాడుతూ.. ఆపరేషన్ విజయవంతమైందని తెలిపారు. ‘రోగి మానసికంగా అనారోగ్యంగా ఉన్నాడు. అతను ఈ సర్జరీ నుంచి త్వరగానే కోలుకుంటున్నాడు. ఐరన్ ఇన్స్ట్రూమెంట్స్ కడుపులోకి ఎలా ప్రవేశించాయనే మా ప్రశ్నలకు కరణ్ స్పందించలేదు. కరణ్ సెప్సిస్ బారిన పడే అవకాశం ఉంది. అందుకే రాబోయే ఏడు రోజులు కరణ్ ఆరోగ్యానికి చాలా కీలకం. కాబట్టి మేం అతన్ని అబ్జర్వేషన్లోనే ఉంచాం’ అని డాక్టర్ అవస్థీ తెలిపారు.
For More News..