
డ్రై, ఆయిలీ, నార్మల్.. స్కిన్ టైప్ ఏదైనా సరే మాయిశ్చరైజర్ కంపల్సరీ. చలికాలంలో అయితే ఇది తప్పనిసరి. కానీ, కాలమేదైనా పదేపదే మాయిశ్చరైజర్ రాస్తే చిక్కులు తప్పవు. మోతాదుకి మించి మాయిశ్చరైజర్ వాడితే చర్మాన్ని డేంజర్ జోన్లోకి నెట్టినట్టే. ఇదే విషయాన్ని ‘ఈస్తటిక్ క్లినిక్’ కాస్మొటిక్ డెర్మటాలజిస్ట్, సర్జన్ రింకీ కపూర్ కూడా చెబుతోంది. మాయిశ్చరైజర్ ఎక్కువగా వాడితే చర్మంపై పగుళ్లు, బ్లాక్ హెడ్స్, గడ్డలు వస్తాయి. అలాగే చర్మ కణాలు మూసుకుపోయి చర్మం మరింత డ్రై అవుతుంది అంటున్నారామె. ఈ సమస్యకి సొల్యూషన్ ఏంటంటే..
చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉండాలని మాయిశ్చరైజర్ రాయడం మంచిదే. కానీ, అది మోతాదు మించితే.. చర్మంపై పేరుకుపోతుంది. దుమ్ము ధూళిని అబ్జార్బ్ చేసుకుంటుంది. దాంతో చర్మానికి సరిపడా గాలి అందదు. దానివల్ల చర్మం డల్గా, డ్రైగా మారిపోతుంది. సెబేషియస్ గ్రంథుల నుంచి సీబమ్ ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల చర్మం నేచురల్గానే మాయిశ్చరైజ్ అవుతుంది. దుమ్ము, ధూళి, ఎండ నుంచి తనని తాను కాపాడుకుంటుంది. కానీ, ఎక్కువగా మాయిశ్చరైజర్స్ రాయడం వల్ల సీబమ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. దానివల్ల చర్మానికి సరిపడా న్యూట్రియెంట్స్ అందక కొత్త సమస్యలు వస్తాయి.
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మాయిశ్చరైజర్స్ అన్నీ పారాబిన్స్, ఆస్ట్రిజెంట్స్, ప్రొపైలిన్ గ్లైకాల్, మినరల్ ఆయిల్, ట్రైఎథనోలమైన్, హైడాంటోయిన్తో పాటు రకరకాల ఫ్రాగ్నెన్స్లతో నిండినవే. పైగా పెట్రోలియం బేస్డ్ ప్రొడక్ట్స్ కూడా ఎక్కువే. వీటివల్ల చర్మంపై అలర్జీలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. క్యాన్సర్స్కి దారితీస్తాయి ఇవి. ఇమ్యూనిటీ సిస్టమ్ని దెబ్బతీసి మరెన్నో చర్మ సమస్యల్ని తీసుకొస్తాయి. అందుకే కెమికల్స్తో నిండిన ఈ మాయిశ్చరైజర్స్కి బదులు నేచురల్ ఇంగ్రెడియెంట్స్ ఉండే వీగన్, ఆర్గానిక్ మాయిశ్చరైజర్స్ వాడటం మంచిది. ఎక్కువగా మాయిశ్చరైజర్ రాస్తే చర్మ కణాలు మూసుకుపోతాయి. దీనివల్ల బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్తో పాటు యాక్నె సమస్యలు వస్తాయి. చర్మం ఎర్రబడుతుంది. దద్దుర్లు వస్తాయి. అందుకే వంటింట్లో దొరికే పదార్థాలతోనే చర్మాన్ని మాయిశ్చ రైజ్ చేసుకోవాలని చెబుతోంది రింకీ కపూర్.
వంటింటి మాయిశ్చరైజర్స్
తేనె, కొబ్బరి నూనె, ఆలివ్, ఆల్మండ్ ఆయిల్స్, పెరుగు, కీరదోస, ఓట్స్, సన్ ఫ్లవర్, క్యారెట్ జ్యూస్, అలొవెరాలని నేచురల్ మాయిశ్చరైజర్స్గా వాడొచ్చు. వీటిల్లో విటమిన్–ఎ, ఈ , కె, డి లాంటి మాయిశ్చరైజింగ్ విటమిన్స్తో పాటు యాంటీ ఆక్సిడైజింగ్, యాంటీ ఏజింగ్ ప్రాపర్టీలు ఉంటాయి. వీటివల్ల కాలమేదైనా చర్మం మెరుస్తుంది. ఇవి అన్ని రకాల స్కిన్ టైప్స్ వాళ్లకి సూట్ అవుతాయి కూడా. ఇవేమీ వద్దనుకుంటే చర్మాన్ని శుభ్రంగా కడుక్కుని, డెడ్ స్కిన్ సెల్స్ని తీసేయాలి. ఆ తర్వాత కొంచెం మాయిశ్చరైజర్ తీసుకుని చర్మాన్ని మసాజ్ చేయాలి. కావాలంటే ఈ ఆరెంజ్ ఫేస్ ప్యాక్ కూడా ట్రై చేయొచ్చు.
కావాల్సినవి:
ఆరెంజ్– మూడు
పెరుగు – ఒక టేబుల్ స్పూన్
తేనె – ఒక టేబుల్ స్పూన్
తయారీ
ఆరెంజ్ తొక్కలని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలు చేయాలి. ఆ ముక్కలని ఎండబెట్టి, మెత్తగా పొడి చేయాలి. రెండు టేబుల్ స్పూన్ల పౌడర్లో పెరుగు, తేనె కలిపి పేస్ట్లా చేయాలి. దాన్ని ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడగాలి.