
న్యూఢిల్లీ:అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్పై తన అక్కసును వెళ్ళగక్కారు. ఐఫోన్లను భారతదేశంలో తయారు చేయకూడదని, అమెరికాలోనే ప్రొడక్షన్ జరగాలని యాపిల్ సీఈఓ టిమ్ కుక్కు స్పష్టం చేసినట్టు ట్రంప్ వెల్లడించారు. భారత్లో కానీ మరే ఇతర దేశంలో ఉత్పత్తి చేసి, యూఎస్లోకి దిగుమతి చేసుకున్నా 25శాతం సుంకం విధిస్తామని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు వాణిజ్య వర్గాల్లో సంచలనం సృష్టించాయి. మెజారిటీ ఫోన్లను ఇండియాలోనే తయారు చేయాలని అనుకుంటున్న అమెరికా కంపెనీ యాపిల్కు ఆందోళన కలిగించేవిగా మారాయి.
ఖతార్ పర్యటనలో భాగంగా ఒక వాణిజ్య సదస్సులో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, "అమెరికాలో అమ్మే ఐఫోన్లను ఇండియాలో తయారు చేయవద్దని నేను టిమ్కుక్కు చాలా కాలం క్రితమే చెప్పాను. అమెరికాలోనే ఉత్పత్తి చేయాలని సూచించాను. లేకపోతే 25 శాతం టారిఫ్ కట్టాలని చెప్పాను" అని అన్నారు. భారత్ ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో ఒకటని, అక్కడ అమెరికా ఉత్పత్తులను అమ్మడం చాలా కష్టమని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాలో తయారీ కార్యకలాపాలను పెంచాలని యాపిల్ను కోరినట్లు తెలిపారు. ట్రంప్ కామెంట్ల కారణంగా యాపిల్ షేర్లు శుక్రవారం మూడు శాతానికిపైగా నష్టపోయాయి. ట్రంప్ కామెంట్లపై భారత్ ప్రభుత్వం లేదా యాపిల్ కంపెనీ నుంచి అధికారికంగా ఎలాంటి స్పందనా రాలేదు. కొన్ని ప్రభుత్వ సంస్థలు మాత్రం యాపిల్ తమ పెట్టుబడి ప్రణాళికలను మార్చుకునే ఉద్దేశం లేదని తెలిపాయి.
భారత్వైపు యాపిల్ మొగ్గు
గత కొన్ని సంవత్సరాలుగా, యాపిల్ తన ఐఫోన్ ఉత్పత్తిని చైనా నుంచి ఇతర దేశాలకు, ముఖ్యంగా భారతదేశానికి తరలించే ప్రయత్నాలు చేస్తోంది. చైనా–-అమెరికా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు, చైనాలో ఉత్పత్తి వ్యయాలు పెరగడం వంటి కారణాలతో యాపిల్ భారత్ వైపు దృష్టి సారించింది. గత ఆర్థిక సంవత్సరంలో (మార్చితో ముగిసిన) యాపిల్ భారత్లో దాదాపు 22 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్లను ఉత్పత్తి చేసింది. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 60శాతం అధికం. 2026 నాటికి అమెరికా మార్కెట్ కోసం ఉత్పత్తి చేసే ఐఫోన్లలో ఎక్కువ భారత్లోనే తయారు చేయాలని యాపిల్ లక్ష్యంగా పెట్టుకుంది. యాపిల్తోపాటు దాని సప్లయర్లూ ఇండియావైపు చూస్తున్నాయి. ఇండియాలో ఐఫోన్లను ఫాక్స్కాన్ తయారు చేస్తోంది. ఇది విస్ట్రన్ కార్పొరేషన్ను కూడా కొనుగోలు చేసింది. విస్ట్రన్ సైతం ఐఫోన్లను తయారు చేసేది. ఇండియాలో ఐఫోన్ల ఉత్పత్తిని పెంచడానికి టాటా, ఫాక్స్కాన్లు కొత్తగా ప్లాంట్లను నిర్మిస్తున్నాయి. ప్రస్తుత ప్లాంట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతున్నాయి.
యూరప్ వస్తువులపై 50 శాతం టారిఫ్!
యాపిల్తోపాటు యూరప్ దేశాలనూ ట్రంప్ బెదిరించారు. యూరోపియన్ యూనియన్తో (ఈయూ) వాణిజ్య చర్చలు ముందుకు సాగడం లేదన్నారు. ఈ ఏడాది జూన్ నుంచి ఈయూ వస్తువులపై 50శాతం సుంకాన్ని విధిస్తామని హెచ్చరించారు. ఈ ప్రకటన ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో ఆందోళన రేకెత్తించింది. ‘‘అమెరికా వాణిజ్యంతో లబ్ధి పొందేందుకే ఈయూ ఏర్పడింది. వారి వాణిజ్య విధానాలు బాగాలేవు. అధిక పన్నులు, కార్పొరేట్ జరిమానాలు, అమెరికన్ కంపెనీలతో అన్యాయమైన విధానాల వల్ల అమెరికాకు 250 బిలియన్ డాలర్లకు పైగా వాణిజ్య లోటు ఏర్పడింది. వారితోచర్చలు ముందుకు సాగడం లేదు" అని ట్రంప్ ట్రూత్సోషల్లో విమర్శించారు. ఈ నిర్ణయం అమలులోకి వస్తే, ఆటోమొబైల్స్ నుంచి వ్యవసాయ ఉత్పత్తుల వరకు వివిధ రంగాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని యూరోపియన్ అధికారులు చెబుతున్నారు.