
- ఏం చేశారంటూ గులాబీ లీడర్లను నిలదీసిన జనం
- ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్కు ప్రచారం చేయొద్దు
- బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్న వట్టినాగులపల్లి గ్రామస్తులు
గండిపేట్, వెలుగు : ‘మా సమస్యలు పరిష్కరించని ఎమ్మెల్యేను ఎప్పుడో బహిష్కరించాం. ఏం అభివృద్ధి చేశారని ప్రచారానికి వచ్చారు. మా ఓట్లు అక్కర్లేదన్న ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఎలా ప్రచారం చేస్తారు’ అంటూ ప్రశ్నిస్తూ నార్సింగి మున్సిపల్ వట్టినాగులపల్లి గ్రామస్తులు బీఆర్ఎస్ నేతలను నిలదీశారు. మంగళవారం గ్రామంలో ఎన్నికల ప్రచారం చేసేందుకు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్కు మద్దతుగా వెళ్లిన గులాబీ నేతలను గ్రామస్తులు అడ్డుకుని, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘మా గ్రామంలో పనులు మేం చేసుకుంటాం . బీఆర్ఎస్ నేతలు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి’ అంటూ గ్రామస్తులు హెచ్చరించారు. విప్రోలో భూములు కోల్పోయినా ఎమ్మెల్యే తమకు న్యాయం చేయలేదని మండిపడ్డారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా ఇవ్వలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు, గ్రామస్తులకు మధ్య వాగ్వాదం ఉద్రిక్తంగా మారింది. దీంతో ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ వట్టినాగులపల్లిలో ప్రచారాన్ని వాయిదా వేసుకున్నారు.