ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

సూర్యాపేట, వెలుగు: జిల్లాకు జాతీయ గ్రామీణ అవార్డులు మిస్​కాకుండా  అధికారులు కృషి చేయాలని  కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ ఆదేశించారు.  బుధవారం కలెక్టరేట్​లో జాతీయ గ్రామీణ అవార్డుల విధి విధానాలపై 29  శాఖల అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్​మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ఉత్తమ పంచాయతీలు, మండలాలు, జిల్లాలను ఎంపిక చేసేందుకు  మౌలిక వసతులు, ప్రజల జీవన ప్రమాణాలు , పచ్చదనం  పరిశుభ్రత, ప్రజారోగ్యం, సామాజిక భద్రత, భరోసా,పేదరిక నిర్మూలన లాంటి అంశాలను పరిగణలోకి  తీసుకుంటారని పేర్కొన్నారు. 9 కేటగిరీల్లో అవార్డులను ప్రకటిస్తారని,  రూ.20 లక్షల నుంచి రూ.5 కోట్ల ప్రైజ్ మనీ ఉంటుందని తెలిపారు. ఆఫీసర్లు నిర్ధేశించిన ఫార్మాట్​లో  సమాచారాన్ని  పొందుపరచి  సకాలంలో జిల్లాలో సమర్పించాలని కోరారు.  సీఈవో సురేశ్, డీఆర్డీవో పీడీ సుందరి కిరణ్ కుమార్,  డీపీవో యాదయ్య,  డీఎంహెచ్​వో డాక్టర్​కోటాచాలం తదితరులు పాల్గొన్నారు.

గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలి

మిర్యాలగూడ, వెలుగు : గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలని డబ్యూడీవో సుభద్ర, ఎంపీపీ నూకల సరళ  అన్నారు. బుధవారం మండలంలోని శ్రీనివాసనగర్​లో ఐసీడీఎస్​ఆధ్వర్యంలో పోషణ్​అభియాన్​లో భాగంగా 9 మంది  గర్భిణులకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్​వాడీ కేంద్రాల ద్వారా అందించే ఆహారంతో పాటు గర్భిణులు  వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటే  గర్భస్త శిశువు ఆరోగ్యంగా పెరుగుతుందని చెప్పారు. సీడీపీవో మమత, సర్పంచ్ వెంకట రమణ చౌదరి, ఎంపీటీసీ సుజాత, కార్యదర్శి అనిత  పాల్గొన్నారు.

మెడిసిన్ స్టూడెంట్​ మిస్సింగ్

నార్కట్ పల్లి, వెలుగు:  మండల పరిధిలోని కామినేని మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్​థర్డ్​ ఇయర్ చదువుతున్న స్టూడెంట్​అదృశ్యమైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై రామకృష్ణ వివరాల ప్రకారం.. కొత్తగూడెంకు చెందిన గుండ బత్తిని సాయి కిరణ్ (21) నార్కట్ పల్లి పట్టణంలో ఓ ప్రైవేటు రూమ్​స్నేహితులతో కలసి కిరాయికి తీసుకుని ఉంటూ చదువుకుంటున్నాడు. సోమవారం  ఇంటికి వెళ్లేందుకు పైసలు కావాలని స్నేహితులను  అడిగాడు. వారు  లేవని చెప్పడంతో కాలేజీ కి వెళ్తున్నానని చెప్పి బయలుదేరాడు. అప్పటి నుంచి కనపడడం లేదని స్నేహితులు తల్లిదండ్రులకు తెలిపారు. వారు కాలేజీకి వెళ్లి ఆరా తీయగా కాలేజీకి కూడా రావడం లేదని లెక్చరర్లు చెప్పారు. దీంతో వారు నార్కట్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

బీజేపీలోకి కొనసాగుతున్న చేరికలు

చండూరు,( మర్రిగూడ) వెలుగు: మునుగోడు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో  బుధవారం వివిధ పార్టీలకు చెందిన నాయకులు, 200 మంది కార్యకర్తలు బీజేపీలో చేరారు. మర్రిగూడ మండలం రాంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్​ రవీందర్ రావు ఆధ్వర్యంలో మాజీ ఎంపీపీ పాముల యాదయ్య, రాంరెడ్డిపల్లి మాజీ సర్పంచ్ లపంగి మల్లయ్య, కార్యకర్తలకు మర్రిగూడలో రాజగోపాల్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారు.  

అంగన్​వాడీ కేంద్రాల అభివృద్ధికి చేయూత

మునుగోడు, వెలుగు:  అంగన్​వాడీ కేంద్రాల అభివృద్ధికి  చేయూతనిస్తున్నామని కస్తూరి  ఫౌండేషన్  చైర్మన్ శ్రీచరణ్​అన్నారు. ​​ మండలంలోని  కల్వకుంట్ల అంగన్​వాడీ కేంద్రం, ప్రైమరీ స్కూళ్లకు పెయింటింగ్​రూ. 3.50 లక్షలతో పెయింటింగ్​ చేయించినందుకు  బుధవారం గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్​వాడీ కేంద్రాలకు సొంత భవనాలు లేక కిరాయి భవనాల్లో కొనసాగిస్తున్నారని, చాలా చోట్ల అంగన్​వాడీ కేంద్రాలు మంజూరైన  నిధులు లేక మధ్యలోనే నిలిపివేశారన్నారు. ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని కోరారు. డీసీసీబీ డైరెక్టర్​కుంభం శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్​పగిళ్ల భిక్షం, ఫౌండేషన్ సభ్యుడు సాగర్ల లింగయ్య , మహేశ్ తదితరులు పాల్గొన్నారు.

వృద్ధురాలి మృతదేహం గుర్తింపు

యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లా భువనగిరిలో గుర్తు తెలియని వృద్దురాలు మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.  సీఐ సత్యనారాయణ వివరాల ప్రకారం.. పట్టణంలో ఓ వృద్ధురాలి మృత దేహం కుళ్లిపోయి ఉందని స్థానికులు చెప్పడంతో  సంఘటనా స్థలానికి వెళ్లామన్నారు. సుమారు 70 ఏళ్ల వయస్సు గల వృద్ధురాలు మూడు రోజుల కిందట చనిపోయి ఉండవచ్చని సీఐ తెలిపారు. డెడ్​బాడీని భువనగిరి ఏరియా ఆసత్రికి తరలించామన్నారు.

జోడో యాత్రకు మద్దతుగా నేడు పాదయాత్ర

యాదాద్రి, వెలుగు:  ఏఐసీసీ నేత రాహుల్​గాంధీ చేస్తున్న జోడో యాత్రకు మద్దతుగా గురువారం యాదాద్రి జిల్లా వడపర్తి నుంచి భువనగిరి వరకు  పాదయాత్ర నిర్వహించనున్నట్లు డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్​కుమార్​రెడ్డి  తెలిపారు. వడపర్తిలో గురువారం 10 గంటలకు మొదలై హన్మాపురం, మన్నెవారిపంపు, కుర్మగూడెం మీదుగా సాయంత్రానికి భువనగిరిలోకి ప్రవేశించనుందని తెలిపారు. 10 కిలోమీటర్లు సాగే ఈ పాదయాత్రలో అందరూ పాల్గొనాలని  కోరారు. దేశ సమైక్యత కోసం రాహుల్ గాంధీ​ చేపట్టిన భారత్​ జోడో యాత్రకు అందరూ సంఘీభావం ప్రకటించాలని కోరారు.

భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి

చండూరు,( మర్రిగూడ) వెలుగు: శివన్నగూడ రిజర్వాయర్ లో భూములు కోల్పోయిన రైతులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వకపోవడం దుర్మార్గమని  ఏఐసీసీ  మెంబర్​పాల్వాయి స్రవంతి రెడ్డి అన్నారు. మర్రిగూడ  తహసీల్దార్​ఆఫీస్​వద్ద కుదాబక్షపల్లి, రాంరెడ్డిపల్లి, శివన్నగూడ, అజిలాపురం గ్రామాల నిర్వాసితులు చేపట్టిన నిరసన దీక్ష కు బుధవారం ఆమె హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాజెక్టు శంకుస్థాపన చేసినప్పుడు కుర్చీ వేసుకొని కూర్చుని ప్రాజెక్టు పూర్తి చేస్తానని చెప్పిన సీఎం కేసీఆర్ మాటతప్పారని విమర్శించారు. ప్రభుత్వానికి  రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే, సీఎం నిర్వాసితులకు వెంటనే న్యాయం 
చేయాలన్నారు.  

బీజేపీని ఓడించేందుకే టీఆర్ఎస్ కు మద్దతు

సంస్థాన్ నారాయణపురం, వెలుగు: మునుగోడు బైఎలక్షన్స్​లో బీజేపీని ఓడించేందుకే టీఆర్ఎస్​పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. టీఆర్ఎస్​అభ్యర్థిని గెలిపించడానికి  సీపీఎం శ్రేణులు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బుధవారం సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామంలో సీపీఎం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డితో కలిసి హాజరైన తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. బీజేపీ దేశంలో దుర్మార్గమైన పాలన చేస్తోందని విమర్శించారు.   రాష్ట్రంలో మత ఘర్షణలు లేపేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. అక్రమంగా ప్రభుత్వాలను కూల్చే బీజేపీ ని రాష్ట్రంలో గెలవనీయొద్దని వీరభద్రం పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే నంద్యాల నరసింహారెడ్డి, సుధాకర్​రెడ్డి, ఎండీ జహంగీర్, తుమ్మల వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆపదలో ఉన్నవారికి సీఎంఆర్​ఎఫ్​ భరోసా

సూర్యాపేట, వెలుగు: ఆపదలో ఉన్న వారికి సీఎం సహాయనిధి ఎంతో మేలు చేస్తోందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.  జిల్లా కేంద్రంలోని పాత వ్యవసాయ మార్కెట్ యార్డులో  పలువురు లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్​రెడ్డి మాట్లాడుతూ పేద, మధ్య తరగతి ప్రజలకు సీఎం రిలీఫ్‌‌‌‌ ఫండ్‌‌‌‌ వరంగా మారిందన్నారు. పేదల కోసం సీఎం కేసీఆర్‌‌‌‌ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, జడ్పీటీసీలు, సర్పంచ్​లు పాల్గొన్నారు.  

వినాయకులకు  ‘చలసాని’ పూజలు

నేరేడుచర్ల, వెలుగు: మండలంలోని పలు గ్రామాలకు గణపతి విగ్రహాలు పంపిణీ చేసిన టీఆర్ఎస్ జిల్లా నాయకుడు చలసాని శ్రీనివాస్, ఆయన కుమారుడు  రాజీవ్ బుధవారం ముకుందాపురం, సోమారం, ఎల్లారం, పెంచికల్ దిన్నె, శివాజీనగర్ లో గణేశ్​మండపాల్లో  ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు చేపట్టడంలో ఉన్న ఆనందం దేనిలో లేదన్నారు. రానున్న రోజుల్లో ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతామని, ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ అండగా నిలుస్తామన్నారు. శ్రీనివాస్, రాజీవ్ లను ఆయా మండపాల నిర్వహణ కమిటీలు శాలవాలతో సత్కరించారు.  సర్పంచ్ లు నాగరాజు,శేఖర్ రెడ్డి, ఎంపీటీసీ  రమణ ,  పీఏసీఎస్ చైర్మన్  శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

నేత్ర దానాన్ని ప్రోత్సహించాలి

నల్గొండ అర్బన్​, వెలుగు : నేత్రదాన కార్యక్రమాలను ప్రోత్సహించాలని డీఎంహెచ్​వో డాక్టర్​ కొండల్​రావు తెలిపారు. బుధవారం నల్గొండ జిల్లా ప్రభుత్వాస్పత్రిలో జరిగిన 37వ నేత్రదాన పక్షోత్సవాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మృతదేహాలను ఖననం చేసే ముందు నేత్రదానం చేయడం వల్ల అంధులైన వారికి చూపు దక్కించిన వారవుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్​సూపరింటెండెంట్​ లచ్చునాయక్​, డాక్టర్లు పుల్లారావు, అనితారాణి, రాజశేఖర్​ తదితరులు పాల్గొన్నారు. 

ఓటర్ కార్డుకు ఆధార్ లింక్ చేసుకోవాలి

గరిడేపల్లి, వెలుగు: ఓటర్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఆధార్ తో అనుసంధానం చేసుకోవాలని హుజూర్​నగర్ ఆర్డీవో కె. వెంకారెడ్డి సూచించారు. బుధవారం మండలంలోని ఎల్బీనగర్ లో జరిగిన మహిళా స్వయం సహాయక సంఘాల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. వీబీకేలు, బూత్ లెవల్ ఆఫీసర్లు వీలైనంత త్వరగా ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్, ఓటర్ ఐడీని ఆధార్ కార్డుతో లింక్ చేయాలని కోరారు.  తహసీల్దార్ కార్తీక్, సర్పంచ్  నారాయణరెడ్డి, ఆర్ఐ సంపత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి

పెన్ పహాడ్, వెలుగు:  మండల పరిధిలోని మాచారం గ్రామ శివారులో  బైకు అదుపు తప్పి కిందపడడంతో ఓ వ్యక్తి  చనిపోయాడు. ఎస్సై బత్తిని శ్రీకాంత్ గౌడ్ వివరాల ప్రకారం.. హుజూర్ నగర్ పార్థసారథి  ట్రాన్స్​పోర్టులో లారీ డ్రైవర్ గా పని చేస్తున్న భావన నాగరాజు(36) మంగళవారం రాత్రి డ్యూటీ దిగి  తన బైక్​పై గరిడేపల్లి  నుంచి సూర్యాపేట వెళ్తుండగా మాచారం మూల మలుపు వద్ద అదుపు తప్పి గుంతలో పడ్డాడు. తలకు తీవ్రమైన గాయా లై స్పాట్​లోనే  చనిపోయాడు. భార్య వసంత  కంప్లైంట్ మేరకు కేసు ఫైల్​ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై  తెలిపారు.

తండ్రి మందలించిండని విద్యార్థి ఆత్మహత్య

భూదాన్ పోచంపల్లి, వెలుగు: మండలంలోని వంకమామిడిలో  తండ్రి మందలించాడని బుధవారం ఓ ఇంటర్​విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కటికరెడ్డి శ్రీనురెడ్డి పెద్ద  కుమారుడు శివ (16) హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్​హాస్టల్​లో ఉంటూ  ఇంటర్​ఫస్ట్​ఇయర్​చదువుతున్నాడు. వినాయకచవితి కావడంతో ఇంటికి వచ్చాడు. బుధవారం కాలేజీకి వెళ్లాలని తండ్రి చెప్పడంతో తనకు ప్రైవేట్​హాస్టల్​లో ఉండడం ఇష్టం లేదని చెప్పాడు.  ఏదేమైనా కాలేజీకి వెళ్లాల్సిందేనని తండ్రి మందలించడంతో మనస్తాపం చెంది శ్రీనురెడ్డి కి పాత, కొత్త ఇండ్లు ఉండగా.. శివ పాత ఇంట్లోకి వెళ్లి పడుకున్నాడు. తెల్లవారి లేచి చూసేసరికి ఉరేసుకొని శవంగా కనిపించాడు.