హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో ఉన్నత స్థానాల్లో పదేండ్లుగా పనిచేసి, ప్రభుత్వం మారాక కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు అప్లై చేసుకుంటున్న ఐఏఎస్లపై మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరు మురళి ట్విటర్ వేదికగా కామెంట్స్ చేశారు. ‘అప్పటి ప్రభుత్వంలో చేసినవన్ని చేసి కొత్త ప్రభుత్వం రాగానే కేంద్ర ప్రభుత్వ సర్వీస్లోకి వెళ్లి (అక్కడి క్యాస్ట్ కనెక్షన్స్ నెట్వర్క్ వాడుకొని) ఇక్కడి తప్పులను తప్పించుకోవడం కొంత మంది ఐఏఎస్ ఆఫీసర్లకు ఫ్యాషన్ అయ్యింది. తెలంగాణ ప్రభుత్వం వీళ్లను కేంద్రానికి పంపకుండా చర్యలు తీసుకోవాలి.
తప్పులు చెయ్యకపోతే ఎందుకు భుజాలు తడుముకోడం.. దేశం మొత్తంలో హెలికాప్టర్లో వెళ్లి పనులు చేసిన ఏకైక ఐఏఎస్ ఆఫీసర్ ఈమె మాత్రమే’ అంటూ స్మితా సభర్వాల్ పై వెలుగు డిజిటల్లో వచ్చిన వార్తను షేర్ చేశారు. కాగా, తాను కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు అప్లై చేసుకోలేదని స్మితా సబర్వాల్ ట్విటర్లో ప్రకటించారు. రాష్ట్రంలో ఏ బాధ్యతలు ఇచ్చినా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు.