జీఆర్ఎంబీకి సీడబ్ల్యూసీ ఆదేశం
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం అడిషనల్ టీఎంసీతో కూడిన డీపీఆర్ను పరిశీలించాలని గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ)ని సీడబ్ల్యూసీ ఆదేశించింది. డీపీఆర్లో ఉన్న అంశాలను పరిశీలించి అందులోని లోటుపాట్లు, ఇతర అంశాలపై తమకు నివేదిక ఇవ్వాలని సూచించింది. సీడబ్ల్యూసీ తాజా ఆదేశాలతో కాళేశ్వరం అడిషనల్ టీఎంసీ అనుమతుల ప్రక్రియ కాస్త ముందుకు పడింది. జీఆర్ఎంబీ గెజిట్ నోటిఫికేషన్ నుంచి కాళేశ్వరం అడిషనల్ టీఎంసీ కంపోనెంట్ తొలగించాలని జీఆర్ఎంబీతో పాటు సీడబ్ల్యూసీని గతంలో తెలంగాణ కోరింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు తీసుకున్నామని, తక్కువ రోజుల్లో ఎక్కువ నీటిని ఎత్తిపోసేందుకే అడిషనల్ టీఎంసీ పనులు చేస్తున్నామని వివరించింది. అదనపు పనులకు సంబంధించిన డీపీఆర్ ఇస్తే దీనిని పరిశీలిస్తామని సీడబ్ల్యూసీ రిప్లయ్ ఇచ్చింది. దీంతో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అడిషనల్ టీఎంసీతో కూడిన మొత్తం ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ను సీడబ్ల్యూసీకి అందజేసింది.
అడిషనల్ టీఎంసీ పనులపై కోర్టులో స్టేటస్ కో ఉన్నందున తాము డీపీఆర్ను పరిశీలించలేమని జీఆర్ఎంబీ అభ్యంతరం తెలిపింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాయడంతో సీడబ్ల్యూసీ స్పందించింది.
గోదావరి బోర్డుకు గూడెం లిఫ్ట్, మోడికుంటవాగు డీపీఆర్లు
గూడెం లిఫ్ట్ స్కీం, మోడికుంటవాగు ప్రాజెక్టుల డీపీఆర్లు గోదావరి బోర్డుకు చేరాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 13,590 ఎకరాలకు నీళ్లిచ్చేందుకు రూ.700.2 కోట్లతో మోడికుంటవాగు ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని దండేపల్లి, లక్షెట్టిపేట, మంచిర్యాల మండలాల్లోని 43 గ్రామాల్లోని 30 వేల ఎకరాలకు నీళ్లిచ్చేందుకు రూ.180 కోట్లతో గూడెం ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి 2015లో ప్రారంభించారు.