- సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం
జూబ్లీహిల్స్, వెలుగు: మహిళలు మార్కెట్లో కొనే సరుకులు కాదని, విద్యాలయాల్లో సరస్వతి పుత్రికలని తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ డాక్టర్ జీవీ వెన్నెల గద్దర్ అన్నారు. ఒకప్పుడు ఉద్యోగాల కోసం ఎదురుచూసిన మహిళలు.. నేడు ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగడం గర్వకారణమన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం హైదరాబాద్లోని సాంస్కృతిక సారథి ప్రధాన కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వెన్నెల స్వయంగా రాసి ఆలపించిన మహిళా దినోత్సవ గీతంతో పాటు, వివిధ జిల్లాల కళాకారులు రూపొందించిన చైతన్య గీతాల సీడీలను ఆవిష్కరించారు. 33 జిల్లాల నుంచి వచ్చిన మహిళా కళాకారులకు ఆటపాటల పోటీలు, ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో సావిత్రిబాయి పూలే మహిళా సంఘం అధ్యక్షురాలు బెల్లం మాధవి, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, రచయిత దినకర్, సారథి ఈవో విజయ్ కుమార్ పాల్గొన్నారు.
