
- ట్రాన్సిట్ వారంట్ పై హైదరాబాద్కు తరలింపు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సరూర్ నగర్ అలకనంద మల్టీస్పెషలిటీ హాస్పిటల్ కిడ్నీ రాకెట్ కేసులో కీలక నిందితుడు డాక్టర్ పవన్ కుమార్ ను రాష్ట్ర సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న కీలక నిందితుడిని మంగళవారం ముంబైలో అదుపులోకి తీసుకున్నారు. ట్రాన్సిట్ వారంట్పై నిందితుడిని హైదరాబాద్కు తరలిస్తున్నారు. బుధవారం కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు పంపనున్నారు. కిడ్నీ మార్పిడి వ్యవహారంలో ఈ ఏడాది జనవరి 22న సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
ఈ కేసులో హాస్పిటల్ నిర్వాహకులు, డాక్టర్లు సహా మొత్తం13 మందిని స్థానిక పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. సమగ్ర దర్యాప్తు కోసం కేసును ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఈ మేరకు ఏపీ పోలీసులతో కలిసి రాష్ట్ర సీఐడీ పోలీసులు సెర్చ్ ఆపరేషన్లు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా ఈ నెల 9న విజయనగరం జిల్లాకు చెందిన మురళీకృష్ణ.. బెంగళూరుకు చెందిన ప్రదీప్, విశాఖపట్నానికి చెందిన పవన్ సహా మరికొంత మంది మధ్యవర్తులతో కలిసి కిడ్నీలు మార్పిడి చేసినట్లు అధికారులు ఆధారాలు సేకరించారు.
ఒక్కో కిడ్నీకి రూ.10 లక్షలు తీసుకుని రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలు కిడ్నీ డోనర్లకు అందించేవారని దర్యాప్తులో తేలింది. ఈ కేసులో మే నెలలో తమిళనాడుకు చెందిన శంకరన్, రమ్యలను అధికారులు అరెస్టు చేశారు.