
- ట్రాయ్ చైర్మన్ పీడీ వాఘేలా
రామచంద్రాపురం (పటాన్చెరు), వెలుగు : ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ టెలికాం సర్వీసులలో ఇండియా ఒకటని, నేడు రెండో అతిపెద్ద టెలికాం రంగంగా ఇండియా ఎదిగిందని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) చైర్మన్ డాక్టర్ పీడీ వాఘేలా అన్నారు. ట్రాయ్ నియంత్రణ సంస్థ మాత్రమేనని, కొత్త సేవలు, సర్వీస్ ప్రొవైడర్లు వచ్చినప్పుడు తాము ప్రభుత్వానికి సిఫారసులు చేస్తామన్నారు. పటాన్చెరు పరిధిలోని గీతం డీమ్డ్ యూనివర్శిటీ ప్రొఫెసర్లతో శుక్రవారం జరిగిన ఇంటరాక్షన్ మీటింగ్లో ట్రాయ్ సెక్రటరీ వి. రఘునందన్తో కలిసి ఆయన పాల్గొన్నారు.
దక్షిణ కొరియా ప్రభుత్వంతో కలిసి గీతం నిర్వహిస్తున్న ఇండో-కొరియన్ విండ్ టైర్బైన్ ప్రాజెక్టును సంర్శించిన అనంతరం ముఖాముఖి కార్యక్రమంలో వాఘేలా మాట్లాడారు. టెలికాం రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులతో దేశంలో 170 కోట్ల మందికి మొబైల్ సేవలు అందిస్తున్నామన్నారు. దీనికి తోడు డిజిటల్ ఆర్ధిక వ్యవస్థ అభివృద్ధి చెందడం, యూపీఐ అందుబాటులోకి రావడంతో ప్రపంచంలోనే 40 శాతం డిజిటల్ లావాదేవీలు ఇండియాలో జరుగుతున్నట్లు తెలిపారు.
త్వరలోనే 5జీ టెక్నాలజీని చౌక ధరలకు తీసుకొస్తామన్నారు. కార్యక్రమంలో కోర్ ఇంజినీరింగ్ డీన్ ప్రొఫెసర్ వీఆర్ శాస్ర్తీ, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ శర్మ, మెకానికల్ హెడ్ డాక్టర్ పి. శ్రీనివాస్, విండ్ టైర్బైన్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ వీకే శ్రీధర్, ఆర్కిమెడిస్ గ్రీన్ ఎనర్జీ సీఈఓ సూర్యప్రకాశ్ గజ్జల తదితరులు పాల్గొన్నారు.