
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ స్టేట్ డాక్టర్స్ సెల్, మెడికల్ అండ్ హెల్త్ వింగ్ చైర్మన్గా డాక్టర్ రాజీవ్ నాయక్ నియమితులయ్యారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ ల సమక్షంలో శనివారం రాజీవ్ నాయక్కు నియామక పత్రాన్ని అందజేశారు. ఏఐసీసీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశాల మేరకు ఈ నియామకం చేశామని ప్రకటనలో తెలిపారు. డాక్టర్ రాజీవ్ నాయక్ 2024 నుంచి మెడికల్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నారు.
2018–2021 మధ్య తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (టీ జూడా) అధ్యక్షుడిగా, 2021–2022లో తెలంగాణ సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్గా పనిచేశారు. 2021–2024 వరకు టీ జూడా చీఫ్ అడ్వైజర్గా, 2024లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సూర్యాపేట ఆర్గనైజింగ్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించారు. ఈ సందర్భంగా డా. రాజీవ్ నాయక్ మాట్లాడుతూ.. పార్టీ తనకు నమ్మకంతో అప్పగించిన ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని, ఈ అవకాశం కల్పించిన ఏఐసీసీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.
మంత్రి దామోదర అభినందనలు
చైర్మన్గా నియమితులైన రాజీవ్ మంత్రి దామోదర రాజనర్సింహను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తన నియామకానికి సహకరించిన మంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉన్నత విద్యావంతులు రాజకీయాల్లోకి రావడం అభినందనీయమని, ఉస్మానియా మెడికల్ కాలేజీలో చదివిన డాక్టర్ రాజీవ్ సేవలు వైద్య రంగానికి ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థను మరింత మెరుగుపర్చడానికి కృషి చేయాలని, రోగ నివారణ, ఆరోగ్యకరమైన జీవనశైలిపై ప్రజలకు అవగాహన కల్పించడంపై దృష్టి పెట్టాలని రాజీవ్కు సూచించారు.