
నర్సాపూర్(జి), వెలుగు: నర్సాపూర్ జి మండల కేంద్రంలోని 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రిలో స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి బుధవారం ప్రారంబించారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళలకు పోషణ, అనారోగ్య సమస్యలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.
స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉంటుందని మహేశ్వర్ రెడ్డి అన్నారు. ప్రజలకు ఆస్పత్రిలో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండాలని సూచించారు.
అనంతరం ఆస్పత్రి వార్డులను పరిశీలించి రోగుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. డీఎంహెచ్వో రాజేందర్, సూపరింటెండెంట్ గోపాల్ సింగ్, డాక్టర్ ప్రమోద్ చంద్రారెడ్డి, వైద్యాధికారులు, బీజేపీ మండల అధ్యక్షులు నరేందర్, శ్రీకాంత్ రెడ్డి, దత్తురాం, అర్జున్, మహిపాల్, ప్రవీణ్, గంగాధర్, విజయ్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
లిఫ్ట్ ఇరిగేషన్ పునరుద్ధరణ పనులకు నిధులు మంజూరు
సారంగాపూర్, వెలుగు: రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని మహేశ్వర్ రెడ్డి అన్నారు. నిర్మల్లో ప్రెస్మీట్నిర్వహించి మాట్లాడారు. సారంగాపూర్ మండలంలోని బీరవెల్లి, ఆలూరు గ్రామాల్లో లిఫ్ట్ ఇరిగేషన్ పునరుద్ధరణ పనులకు నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి తెలిపారు.
బీరవెల్లి గ్రామ లిఫ్ట్ ఇరిగేషన్ పునరుద్ధరణకు రూ.69 లక్షలు, ఆలూరు లిఫ్ట్ ఇరిగేషన్కు రూ.32.50 లక్షలు మంజూరైనట్లు వెల్లడించారు. ఆలూరు లిఫ్ట్ ఇరిగేషన్ పనుల టెండర్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందన్నారు. ఈ పనులు పూర్తయితే గ్రామాల్లోని రైతులకు నీటి సౌకర్యం లభించి, వ్యవసాయానికి మేలు జరుగుతుందని పేర్కొన్నారు.