
కోల్బెల్ట్, వెలుగు: చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావడం పట్ల సోమవారం రాత్రి మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని శ్రీరాంపూర్లో యూత్ కాంగ్రెస్ జిల్లా సెక్రటరీ తోకల సురేశ్ యాదవ్ ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. శ్రీరాంపూర్ సింగరేణి ఓపెన్ కాస్ట్ మైన్పై కాంగ్రెస్ లీడర్ బరపాటి మారుతీ ఆధ్వర్యంలో కార్మికులు పటాకులు పేల్చి స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా లీడర్లు మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసిన కాకా కుటుంబం నుంచి వివేక్ వెంకటస్వామికి మంత్రి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.
పార్లమెంటులో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర బిల్లు ప్రవేశపెట్టేవరకు అలుపెరగని పోరాటం చేశారని, అలాంటి ఉద్యమకారుడికి మంత్రి పదవి అసలైన గౌరవమన్నారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి మంత్రి వివేక్ కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. లీడర్లు జీవన్, మదన్, శ్రీను, బానేశ్ తదితరులు పాల్గొన్నారు.