కవిత ఇంటికి మధ్యాహ్నం ఈడీ బృందం వచ్చిన వెంటనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్రావు నందినగర్లోని కేసీఆర్ ఇంటికి వెళ్లారు. అక్కడ సుదీర్ఘంగా చర్చించారు. ఆ తర్వాత అందుబాటులో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు సైతం కేసీఆర్ నివాసానికి వెళ్లారు. అయితే కవితను అరెస్ట్ చేసినట్టు తెలియడంతో కేటీఆర్, హరీశ్రావు, వేముల ప్రశాంత్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి తదితరులు సాయంత్రం 6 గంటలకు ఆమె ఇంటికి చేరుకున్నారు. ఇంటి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా అధికారులు వారిని అడ్డుకున్నారు. అప్పటికే అక్కడ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున గుమిగూడారు. బీజేపీ, ప్రధాని మోదీ, ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేటీఆర్, హరీశ్ అక్కడికి రావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇంటి గేటు వద్ద వాళ్లు లొల్లి చేశారు. చివరకు గేటును తోసుకుని లోపలికి చొచ్చుకుపోయారు. లోపల కేటీఆర్కు, ఈడీ అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో కేటీఆర్ మీడియాకు విడుదల చేశారు. సోదాలు, విచారణ పూర్తయిన తర్వాత కూడా తమను లోపలికి ఎందుకు రానివ్వడం లేదని అధికారులను ఆయన ప్రశ్నించారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా అరెస్ట్ ఎలా చేస్తారంటూ నిలదీశారు. ఈ క్రమంలో కేటీఆర్ కు అధికారులు కూడా గట్టిగానే సమాధానం ఇచ్చారు. అరెస్ట్కు అవసరమైన అన్ని వారెంట్లు చూపించారు. దీంతో కేటీఆర్, హరీశ్సైలెంట్ అయిపోయారు. ఇద్దరు నేతలు కవితను కలిసి ధైర్యం చెప్పారు.
ఎప్పుడేం జరిగిందంటే?
శుక్రవారం మధ్యాహ్నం 1:40 గంటలకు అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ నేతృత్వంలోని ఢిల్లీ ఈడీ బృందం కవిత ఇంటికి చేరుకుంది. ఈ బృందంలో ముగ్గురు మహిళా ఆఫీసర్లు ఉన్నారు. ఈడీ విచారణ, సోదాలకు అంగీకరిస్తూ కవిత సంతకం చేశారు.
1:45 గంటలు: సోదాలు ప్రారంభం
5:20: కవితను అరెస్ట్ చేస్తున్నట్టు భర్త అనిల్కు రాతపూర్వకంగా సమాచారం.
6:30: కవిత వాంగ్మూలం రికార్డ్
6:45: సోదాలు ముగింపు
7:00: ఇంట్లో నుంచి కవితను
తీసుకుని బయటకొచ్చిన ఈడీ ఆఫీసర్లు
7:30: ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కు
కవిత తరలింపు
8:10: ఎయిర్పోర్ట్కు చేరుకున్న
ఈడీ వాహనాలు
చట్టపరంగాఎదుర్కొంటం: కవిత
ఈడీ అరెస్ట్ అక్రమమని, ఈ కుట్రలను చట్టపరంగా ఎదుర్కొంటామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఈ మేరకు ఆమె కార్యాలయం మీడియాకు ప్రకటన విడుదల చేసింది. ‘‘ఇలాంటి అణచివేతలు ఎన్ని జరిగినా ఎదుర్కొంటాం. చట్టంపై నమ్మకం ఉంచి దొంగ కేసులను, రాజకీయ కక్షసాధింపు చర్యలను ఎదుర్కొంటాం. పార్టీ శ్రేణులు మనోధైర్యంతో ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం” అని ప్రకటనలో పేర్కొన్నారు.