తప్పు లేకున్నా సస్పెండ్​ చేశారంటూ.. పెట్రోల్ ​పోసుకున్నడు

తప్పు లేకున్నా సస్పెండ్​ చేశారంటూ.. పెట్రోల్ ​పోసుకున్నడు
  • కాపాడిన స్థానికులు  

ఆదిలాబాద్​ టౌన్, వెలుగు : ఆదిలాబాద్​ ఆర్టీసీ డిపో ముందు నిరంజన్​ అనే డ్రైవర్​ గురువారం సాయంత్రం పెట్రోల్​ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికులు స్పందించి అడ్డుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. బాధితుడి కథనం ప్రకారం.. ఆదిలాబాద్​ డిపోకు చెందిన సూపర్​లగ్జరీ బస్సు ఈ నెల 4న ఒంగోలు నుంచి ఆదిలాబాద్​ వస్తోంది. అందులో టిమ్ ​డ్రైవర్​రవీందర్​తో కలిసి డ్రైవర్ ​నిరంజన్​ డ్యూటీలో ఉన్నాడు. ధర్మారం వద్ద ఆర్టీసీ విజిలెన్స్​అధికారులు బస్సును తనిఖీ చేయగా ఇద్దరు టికెట్​లేకుండా ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. 

దానికి డ్రైవర్​ నిరంజన్​ను బాధ్యుడిగా చేసి అధికారులు సస్పెండ్​ చేశారు. దీంతో కలత చెందిన నిరంజన్​తన తప్పు ఏమీ లేదని వాదిస్తూ గురువారం సాయంత్రం డిపో ముందు పెట్రోల్​పోసుకుని నిప్పంటించుకోబోయాడు. అక్కడున్నవారు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా నిరంజన్​ మాట్లాడుతూ  ప్రయాణికులకు టికెట్​ఇవ్వాల్సిన బాధ్యత టిమ్​డ్రైవర్ దేనని, నాన్ ​టిమ్ ​డ్రైవర్​గా ఉన్న తనపై అధికారులు చర్యలు తీసుకోవడం కరెక్ట్​ కాదని ఆవేదన వ్యక్తం చేశాడు. అనవసరంగా అధికారులు తనను బలిచేశారన్నాడు. నిరంజన్​ను రిమ్స్​కు ​తరలించి వైద్య పరీక్షలు చేయించారు.