సంక్రాంతి రద్దీ.. సికింద్రాబాద్లో ప్రత్యేక ఏర్పాట్లు : డీఆర్ఎం గోపాల కృష్ణన్

సంక్రాంతి రద్దీ.. సికింద్రాబాద్లో ప్రత్యేక ఏర్పాట్లు : డీఆర్ఎం గోపాల కృష్ణన్
  • రైల్వే స్టేషన్​లో ఏర్పాట్లు పరిశీలించిన డీఆర్ఎం గోపాల కృష్ణన్

హైదరాబాద్​సిటీ, వెలుగు: సంక్రాంతి సీజన్​లో ప్రయాణికుల రద్దీని సమర్థవంతంగా నిర్వహించడానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వీటిని  సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ గోపాల కృష్ణన్ మంగళవారం పరిశీలించారు.  స్టేషన్​లో జరుగుతున్న పనుల దృష్ట్యా ప్లాట్​ఫామ్ 1 వైపు పార్కింగ్ నిలిపివేశారు. ఇక్కడ పికప్, డ్రాప్ మాత్రమే అనుమతిస్తున్నారు. బదులుగా ప్లాట్​ఫామ్ నంబర్ 10 వైపు (బోయిగూడ వైపు) అన్ని సౌకర్యాలు కల్పించి బేస్​మెంట్​-1లో పార్కింగ్ ఏర్పాటు చేశారు.

ప్రయాణికులు దీన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. ప్లాట్​ఫామ్ 1 వైపు గేట్-2, గేట్-4 వద్ద కొత్త హోల్డింగ్ ఏరియాలు, సికింద్రాబాద్ వెస్ట్ మెట్రో స్టేషన్ వైపు కొత్త ఎగ్జిట్ గేట్ 5ఏ తెరిచారు. మెయిన్ టెర్మినల్స్​లో రద్దీ తగ్గించడానికి ముఖ్యమైన 24 రైళ్లకు లింగంపల్లి, హైటెక్ సిటీ, చర్లపల్లి స్టేషన్లలో అదనపు స్టాప్​లు అందుబాటులోకి తీసుకొచ్చారు.

రైళ్లలో మండే వస్తువులు వద్దు

పద్మారావునగర్: రైళ్లలో మండే వస్తువులు, పేలుడు పదార్థాలు తీసుకెళ్లవద్దని ఆర్‌‌పీఎఫ్, జీఆర్‌‌పీ పోలీసులు ప్రయాణికులను కోరారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​లో ప్రయాణికులకు మంగళవారం విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.  అయ్యప్ప భక్తులు రైళ్లలో అగరబత్తీలు, ధూపం వెలిగించవద్దని ప్రత్యేకంగా సూచించారు. డాగ్ స్క్వాడ్ ‘బ్లేజ్’ సహాయంతో ప్లాట్‌‌ఫామ్‌‌లు, రైళ్లలో అనుమానాస్పద వస్తువుల తనిఖీలు నిర్వహించారు.