
హైదరాబాద్లో భారీగా గంజాయి పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. శనివారం (ఆగస్టు2) మాదకద్రవ్యాల అక్రమ రవాణా చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు. కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలోని ధోబీఘాట్ సమీపంలో గంజాయి విక్రయిస్తుండగా ఐదుగురిని పట్టుకున్నారు. వారినుంచి 1.5 కిలోల గంజా స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని చంద్రాపూర్ కు చెందిన రౌడీ షీటర్ మహ్మద్ షారిక్, బోయిన్ పల్లికి చెందిన లవ్ ప్రీత్ సింగ్ లు మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ కు అక్రమ గంజాయి రవాణా చేస్తున్నారు.
షారిక్ నుంచి లవ్ ప్రీత్ సింగ్ గంజాయి కొనుగోలు చేసి సిటీలో అమ్ముతున్నాడు. ఓ కారు అద్దెకు తీసుకొని సిటీలోని వివిధ ప్రాంతాలకు గంజాయి కసరఫరా చేసి అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నాడు. ముగ్గురు స్థానికులకు మాదక ద్రవ్యాలు విక్రయిస్తుండగా మహ్మాద్ షారిక్, లవ్ ప్రీత్ సింగ్ లను పోలీసులు అరెస్ట్ చేశారు.
గంజాయి అక్రమ రవాణా కేసులో మరో నిందితుడు మహారాష్ట్రలోని చంద్రాపూర్ కు చెందిన ముబీన్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.