హైదరాబాద్ నడిబొడ్డున.. ఐమ్యాక్స్ ఓపెన్ గ్రౌండ్స్ పక్కనే డ్రగ్స్ దందాకు తెరలేపారు దుండగులు. గ్రాముకు రూ.8 నుంచి 10 వేలు వసూలు చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్న ముగ్గురిని పోలీసులు శుక్రవారం (డిసెంబర్ 05) అరెస్టు చేశారు.
సైఫాబాద్ పీఎస్ పరిధిలోని ఐమ్యాక్స్ ఓపెన్ గ్రౌండ్ సమీపంలో సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్, సైఫాబాద్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో ముగ్గురు డ్రగ్స్ వ్యాపారులు అరెస్టయ్యారు. మొహమ్మద్ గులాం జిలానీ, ఫిరోజ్ బిన్ అలీ సులేమాన్ ఖాన్ ల నుంచి 100 గ్రాముల బ్రౌన్ షుగర్, 1350 గ్రాముల డ్రై గంజాయి, 7 మొబైల్ ఫోన్లు, హోండా బైక్ (TS15 EH 4694) స్వాధీనం చేసుకున్నారు. మొత్తం విలువ సుమారు ₹23.50 లక్షలు ఉంటుందని చెప్పారు పోలీసులు.
జిలానీ ఒడిశా నుండి డ్రగ్స్ ను తెచ్చి సాహిల్, సులేమాన్లకు సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలింది. వీరు గ్రాముకు రూ.8 వేల నుంచి రూ.10వ వరకు విక్రయిస్తున్నారు. నవంబర్ 4న రేతిబౌలి ప్రాంత వ్యక్తి మొహమ్మద్ అహ్మద్కు 3 గ్రాముల బ్రౌన్ షుగర్ విక్రయించారు. అతడు అధిక మోతాదులో తీసుకుని మరణించిన ఘటనపై రాజేంద్రనగర్ పీఎస్లో కేసు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. అరెస్టైన నిందితులను, స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ ను సైఫాబాద్ పీఎస్కు అప్పగించి తదుపరి చర్యలు చేపట్టారు పోలీసులు.
