కౌకొండలో డీఎస్పీ నేత హత్య.. గొడ్డలితో నరికి చంపిన నిందితులు

కౌకొండలో డీఎస్పీ నేత హత్య.. గొడ్డలితో నరికి చంపిన నిందితులు
  • పాత కక్షలతోనే మర్డర్​ చేశారన్న సోదరుడు
  • మృతుడు ధర్మసమాజ్ ​పార్టీ హనుమకొండ జిల్లా కార్యదర్శి

పరకాల, వెలుగు : హనుమకొండ జిల్లా నడికూడ మండలంలోని కౌకొండలో మంగళవారం పాత కక్షలతో ధర్మసమాజ్​ పార్టీ జిల్లా కార్యదర్శి హత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. కౌకొండకు చెందిన మేకల యుగేందర్ (36)​ ధర్మ సమాజ్​ పార్టీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి. యుగేందర్​ పెద్దమ్మ ఇటీవలే చనిపోగా సోమవారం దశదినకర్మ ఉండడంతో ఊళ్లో కథ చెప్పించారు. చలిమంట కాగుతూ కథ చూస్తుండగా మంగళవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో వెనక నుంచి వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు గొడ్డలితో మెడపై నరికి చంపారు. పాత కక్షలతోనే యుగేందర్​ను హత్య చేసినట్లు మృతుడి సోదరుడు రాజవీరు దామెర పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

తమ కుటుంబానికి ఇంటిస్థలం విషయంలో పాలి పగలు ఉన్నాయని, గతంలోనే వారు తన తమ్ముడు యుగేందర్​ ఎక్కువ చేస్తున్నాడని, వాడి సంగతి చూస్తామని చెప్పారని, అన్నంత పని చేశారని రాజవీరు రోదించాడు. కథ చూస్తున్న తన తమ్ముడు యుగేందర్​ను గొడ్డలితో నరికి చంపాడని పేర్కొన్నాడు. పరకాల రూరల్ ​సీఐ మల్లేశ్​, దామెర ఎస్సై అశోక్​ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని,  త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామని ఎస్సై చెప్పారు.