తిరుపతి వెళ్లే వారిని ప్రభుత్వం అలెర్ట్ చేసింది. భారీ వర్షాల కారణంగా తిరుపతి జిల్లా వరదయ్య పాళ్యం మండలంలోని గోవర్ధనపురం వద్ద ఉన్న పాముల కాలువ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. సోమవారం ( డిసెంబర్ 4) న నీటి ప్రవాహం పెరగడంతో శ్రీకాళహస్తి -చెన్నై మధ్య రాకపోకలను అధికారులు నిలిపివేశారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దని అధికారులు సూచించారు. సురక్షిత భవనాల్లో తలదాచుకోవాలని సూచించారు.
భారీ వర్షాలకు పాముల కాలువ ఉప్పొంగుతోంది. దాంతో శ్రీకాళహస్తి చెన్నూ మధ్య నీటి ప్రవాహం పెరిగి రాకపోకలకు భారీగా అంతరాయం ఏర్పడింది. దీంతో జాతీయ రహదారిపై ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.. ఒకే వైపు నుంచి రాకపోకలు సాగుతున్నాయి. సోమవారం( డిసెంబర్ 4) ఉదయం ఈ పరిస్థితి ఉండడంతో 15 కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. దీంతో పలు మార్గాల్లో వాహనాలను అధికారులు దారి మళ్లించారు. తిరుపతి నుంచి శ్రీకాళహస్తి మీదుగా వెళ్లే వాహనాలను తొట్టంబేడు చెక్ పోస్ట్ వద్ద నిలిపేశారు. వాహనదారులు కడప, పామూరు, దర్శి వైపు వెళ్లాలని సూచిస్తున్నారు.