సర్కారు కొనకపోవడంతో కర్నాటకకు మన వడ్లు

సర్కారు కొనకపోవడంతో కర్నాటకకు మన వడ్లు
  • గద్వాల, నారాయణపేట జిల్లాల నుంచి రాయచూర్‌‌‌‌కు వెళ్తున్న రైతులు
  • ఖమ్మంలో ఏపీ వ్యాపారుల కొనుగోళ్లు
  • మన దగ్గర చాలా జిల్లాల్లో ఇంకా ఓపెన్​ కాని సెంటర్లు
  • తెరిచినా కొనుగోళ్లు స్టార్ట్ చేస్తలే.. టోకెన్ల పేరుతో సతాయింపులు
  • ఎటుచూసినా వడ్ల కుప్పలే.. మబ్బులు పట్టడంతో రైతుల్లో టెన్షన్

వెలుగు, నెట్‌‌వర్క్: మన దగ్గర కొనుగోలు కేంద్రాలు తెరుచుకోక, తెరిచిన చోట కొనుగోళ్లు జరగక వడ్లు అమ్ముకునేందుకు రైతులు పొరుగు రాష్ట్రాలకు పోతున్నారు. కర్నాటక, మహారాష్ట్ర, ఏపీకి వెళ్లి పంటను అమ్ముకుంటున్నారు. నారాయణపేట, గద్వాల జిల్లాలకు చెందిన వడ్ల ట్రాక్టర్లు కర్నాటకకు క్యూ కడుతున్నాయి. ఖమ్మం జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు ఏపీకి చెందిన వ్యాపారులు వచ్చి వడ్లు కొంటున్నారు. కర్నాటక, ఏపీ వ్యాపారులు మద్దతు ధర కంటే తక్కువ ఇస్తున్నా.. వెంటనే కొంటుండటం, నగదు చేతికి వస్తుండడంతో రైతులు అటువైపే మొగ్గుచూపుతున్నారు. ఈ అవకాశం లేని ఇతర జిల్లాల రైతులు.. కొనుగోలు కేంద్రాల్లోని వడ్ల కుప్పల వద్ద పడిగాపులు కాస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా యాసంగి వడ్లు సేకరించేందుకు 6 వేలకు పైగా కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా.. ఇప్పటిదాకా కేవలం 3,550 సెంటర్లు మాత్రమే ఓపెన్ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబ్​నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఎక్కడా ఒక్క సెంటర్ కూడా తెరవలేదు. ఓపెన్​చేసిన చోట్ల సగానికి పైగా సెంటర్లలో కొనుగోళ్లు చేపట్టడం లేదు. పెద్దపల్లి జిల్లాలో పేరుకు 292 కొనుగోలు కేంద్రాలకు రిబ్బన్ కట్ చేసినా, ఒక్క సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ కాంటాలు స్టార్ట్ చేయలేదు. జనగామ జిల్లాలో 180 సెంటర్లకు గాను 24 సెంటర్లను ప్రారంభించిన ఆఫీసర్లు ఇంతవరకు ఒక్క గింజ కూడా కొనలేదు. చాలా జిల్లాల్లో ఇదే పరిస్థితి. దీనికితోడు లారీల కొరత, సరిపడా హమాలీలు లేకపోవడంతో కాంటా పెట్టిన వడ్లు కూడా సెంటర్ల వద్దే పేరుకుపోతున్నాయి. అటు రైస్ మిల్లుల్లోనూ నాలుగైదు రోజుల దాకా అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్ కావడం లేదు. ట్రాక్టర్ల ద్వారా వడ్లను ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు తరలించేందుకు పర్మిషన్ ఇవ్వాలని రైతులు కోరుతున్నా ఆఫీసర్లు స్పందించడంలేదు. నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట లాంటి జిల్లాల్లో ఎప్పటికప్పుడు కొనడం లేదని, అందుకే టోకెన్ల సిస్టమ్ తెచ్చినట్లు రైతులు చెబుతున్నారు. పలుచోట్ల టెక్నికల్ ప్రాబ్లమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోనూ కొనుగోళ్లు లేటవుతున్నాయి. నిర్మల్ జిల్లాలో రైతుల పట్టాపాస్ బుక్‍ నంబర్లు ఆన్‍లైన్‍లో చూపించడం లేదు. సంగారెడ్డి జిల్లాలో 157 సెంటర్లు ప్రారంభం కాగా, రైతుల ఫోన్ నంబర్ లింక్ లేకపోవడంతో ఓటీపీ సమస్య ఎదురవుతోంది. దీంతో కేంద్రాల వద్ద నిల్వలు పెరిగిపోతుండగా, ఫోన్ లింకేజీ కోసం రైతులు ఆధార్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. సర్కారు పెట్టుకున్న లక్ష్యంలో ఇప్పటిదాకా 5 శాతం కూడా కొనలేదు. ఏ కొనుగోలు కేంద్రంలో చూసినా వడ్ల కుప్పల వద్ద దిగాలుగా ఉన్న రైతులే కనిపిస్తున్నారు.

పొరుగు రాష్ట్రానికి వందలాది ట్రాక్టర్లు

జోగులాంబ గద్వాల, నారాయణపేట లాంటి జిల్లాల్లో రాష్ట్ర సర్కారు ఇప్పటివరకు కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేయలేదు. రెండు రోజులుగా మబ్బులు పట్టి, వర్షం పడే సూచనలు కనిపిస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో గద్వాల జిల్లాలోని కేటీ దొడ్డి, ధరూర్, గట్టు, గద్వాల మండలాల నుంచి, నారాయణపేట జిల్లాలోని మాగనూర్, కృష్ణ, మక్తల్, ఊట్కూర్​ప్రాంతాల నుంచి రోజూ వందలాది ట్రాక్టర్లలో రాయచూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ప్రైవేట్ మార్కెట్ యార్డులకు తరలిస్తున్నారు. అక్కడ తేమ, తరుగు పేరుతో ఎలాంటి కటింగులు పెట్టడం లేదని, ఉదయం వడ్లు కాంటా పెడితే సాయంత్రం డబ్బులు చేతిలో పెడుతున్నారని రైతులు అంటున్నారు. క్వింటాల్ గ్రేడ్ వన్ ధాన్యానికి కేంద్రం రూ.1,960, కామన్ రకానికి రూ.1,940 మద్దతు ధర ప్రకటించగా, అక్కడి వ్యాపారులు క్వాలిటీని బట్టి రూ.1,800 నుంచి రూ.1,900 వరకు చెల్లిస్తున్నారని చెబుతున్నారు. ‘‘ఇక్కడ కొనుగోలు సెంటర్లు ఇంకా పెట్టలేదు. పెట్టినా రూలింగ్​పార్టీ లీడర్ల వడ్లే ముందు కాంటా పెడుతరు. మా వంతు వచ్చే సరికి నెలకు పైగా పడుతోంది. అందుకే ధర తక్కువైనా వెంటనే డబ్బులు వస్తున్నందున రాయచూర్ తీసుకెళ్తున్నం” అని రైతులు అంటున్నారు. ఇక ఖమ్మం జిల్లాలో ఏపీ బోర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దగ్గరగా ఉన్న కల్లూరు మండలంలో ప్రస్తుతం వరికోతలు ముమ్మరంగా సాగుతున్నా కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయలేదు. దీంతో ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన వ్యాపారులు లక్ష్మీపురం, లింగాల, చెన్నూరు ఎర్రబోయినపల్లి, రఘునాథగూడెం, వాచానాయక్ తండ తదితర గ్రామాలకు వచ్చి ధాన్యం కొంటున్నారు. క్వింటాల్​కు రూ.1,700 లోపే పెడుతుండడంతో రైతులు లాస్ అవుతున్నారు. కానీ వర్షం వస్తే నిండా మునుగుతామనే భయంతో అమ్ముకుంటున్నామని రైతులు అంటున్నారు.

మన సర్కారు కొంటదన్న నమ్మకం లేదు

సర్కారు పూటకో మాట మాట్లాడుతంది. వరి కోతలు ఎప్పుడో స్టార్ట్ అయినా.. ఇప్పటి దాకా సెంటర్లు పెట్టలేదు. సెంటర్లు పెడుతుందో లేదో తెలియదు. పెట్టినా వడ్లు కొంటరన్న నమ్మకం లేదు. అందుకే మా వడ్లను కర్నాటకకు తీస్కపోయి అమ్ముకుంటున్నం. ఇక్కడ వడ్ల పైసలు ఇచ్చేందుకు నెలలు చేస్తరు. కానీ అక్కడ ప్రైవేట్ వ్యాపారులు వెంటనే ఇస్తన్రు.

- నగేశ్, ఉమిత్యాల, గద్వాల జిల్లా

ప్రైవేటోళ్లకు అమ్ముకున్న

నేను వరి కోసి వారం దాటింది. ఇప్పటిదాకా ఎక్కడా సెంటర్ పెట్టలేదు. ఎప్పుడు ఓపెన్ చేస్తరో తెల్వది. గతంలో సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వడ్లు తీస్కపోతే గన్ని బ్యాగులు కోసం రోజుల తరబడి వెయిట్ చేయించిన్రు. చివరికి దొరక్కపోవడంతో ప్రైవేటోళ్లకు అమ్మిన. ఇప్పుడు కూడా సర్కారు మీద నమ్మకం లేక.. తక్కువ ధరకైనా రాయచూర్​పోయి ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకున్న.

- పరశురాం, అచంపేట్, మాగనూర్ మండలం, నారాయణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేట్

సెంటర్ లేకనే రాయచూర్ పోతున్నం

కోతలు మొదలై నెల గడుస్తున్నా.. మా దగ్గర కొనుగోలు సెంటర్​ పెట్టలేదు. మబ్బు పట్టి వర్షం వచ్చేలా ఉంది. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో వడ్లు, పత్తిని కర్నాటకలోని రాయచూర్ మార్కెట్‌‌కు తీసుకుపోతున్నం. కొన్న రోజే పైసలు కూడా ఇస్తున్నరు.

‑ వెంకట్ రాములు, ఉమిత్యాల, గద్వాల