- రోజుకు 1.60లక్షల టన్నుల ఉత్పత్తికి బ్రేక్
మందమర్రి,వెలుగు: రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు సింగరేణి ఓపెన్కాస్ట్ గనుల్లో బొగ్గు వెలికితీత పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఎనిమిది రోజులనుంచి సింగరేణిలోని అన్ని ఓసీపీల్లో వాన ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఈనెల 3 నుంచి వానలు పడుతున్నా ఈనెల 5 నుంచి ఉత్పత్తి ఆగిపోయింది. కొన్ని గనుల్లో ఇంటర్నల్ రోడ్లన్నీ కొట్టుకుపోయాయి. హెవీ వెహికల్స్ నడిచే పరిస్థితి లేకపోవడంతో ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి, మట్టి తొలగింపు నిలిచిపోయి.. బొగ్గు పెల్ల కూడా బయటకు రావడంలేదు.
మంచిర్యాల, అసిఫాబాద్ జిల్లాలోని మందమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి ఏరియాల్లో ఈనెల 3 నుంచి వానలు పడుతున్నాయి. మిగిలిన చోట్ల రెండు, మూడు రోజుల నుంచి విస్తరంగా వర్షాలు కురుస్తున్నాయి. గనుల్లో 24 నుంచి 34 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు ఇదే భారీ వర్షం. మంచిర్యాల, అసిఫాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, భద్రాది కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలోని 19 ఓపెన్కాస్ట్ గనుల నుంచి రోజుకు 1,63,268 టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది. సింగరేణిలోని 19 ఓసీపీలు, 24 అండర్ గ్రౌండ్ మైన్ల ద్వారా రోజుకు 2.50లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలన్నది టార్గెట్కాగా ఓసీపీల నుంచే 70 నుంచి 80శాతం బొగ్గును ఉత్పత్తి చేస్తున్నారు. అన్ని ఓసీపీల్లో మైనింగ్ ఆపరేషన్స్ఆగిపోవడంతో ఎనిమిది రోజుల్లో సుమారు 13లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లినట్లు ఆఫీసర్లు చెప్తున్నారు. దీంతో సింగరేణి రోజుకు రూ.45 నుంచి 55 కోట్ల వరకు నష్టపోతోంది. 19 ఓసీపీల్లో కలిపి రోజుకు 13లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ పనులు ఆగిపోయాయి. ఓపెన్కాస్ట్ గనుల్లో మట్టి రోడ్లు ఉండటంవల్ల వానలకు పూర్తిగా పాడయ్యాయి. దీంతో డంపర్ వెహికల్స్ నడిపితే బురదలో కూరుకుపోతాయన్న భయంతో వాటిని సర్ఫేస్లోనే నిలిపిఉంచారు.ఉద్యోగులు, కార్మికులు షెల్టర్లకే పరిమితమవుతున్నారు. కొన్ని చోట్ల ఓసీపీ వర్క్ షాపు ల్లోకి కూడా వరదనీరు చేరింది. దీంతో మెషిన్లను రిపేర్ చేసే పరిస్థితి లేక వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. క్వారీల్లో చేరిన వర్షపు నీటిని భారీ పంపుల ద్వారా బయటకు ఎత్తిపోస్తున్నారు. సర్పేస్లో మాత్రం అన్ని పనులు నడుస్తున్నాయి. ఓసీపీల నుంచి కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్లకు బొగ్గురావడం తగ్గిపోవడంతో విద్యుత్తు సంస్థలకు రైల్వే రేక్లను పరిమితంగా పంపుతున్నారు.
వారంలో 10లక్షల టన్నుల బొగ్గు నష్టం
ఏడు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల సింగరేణి సుమారు 10లక్షల టన్నుల బొగ్గును నష్టపోయినట్లు సింగరేణి డైరెక్టర్లు బలరాం(పీపీ, ఫైనాన్స్) , ఎస్.చంద్రశేఖర్(ఆపరేషన్స్) తెలిపారు. సోమవారం అన్ని ఏరియాల జీఎంలతో బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతపై వీడియో కాన్ఫరెన్స్నిర్వహించారు. అండర్ గ్రౌండ్ మైన్లలో ఉత్పత్తి పెంచాలని సూచించారు. మందమర్రి, శ్రీరాంపూర్, భూపాలపల్లి, రామగుండం1 ఏరియాల్లోని యూజీ గనుల్లో ఉత్పత్తి మీద దృష్టి పెట్టాలన్నారు.