ఇండస్ట్రియల్ ఏరియాల్లో రెచ్చిపోతున్న డంపింగ్ మాఫియా

ఇండస్ట్రియల్ ఏరియాల్లో రెచ్చిపోతున్న డంపింగ్ మాఫియా

జీడిమెట్ల, వెలుగు: గ్రేటర్ శివారు ప్రాంతాల్లోని ఇండస్ట్రియల్​ఏరియాల్లో కెమికల్ డంపింగ్​ మాఫియా రెచ్చిపోతోంది.  ప్రమాదకర కెమికల్స్​ను శుద్ధి కేంద్రాలకు తరలించకుండా తీసుకొచ్చి నాలాలు, ఖాళీ ప్రదేశాలు, రోడ్లపై పారబోస్తోంది. దీంతో స్థానికులు రోగాల బారిన పడుతున్నారు. తమకు అడ్డు వచ్చిన వారిపై ఆ ముఠాలు దాడులు కూడా చేస్తున్నాయి. జీడిమెట్ల ఇండస్ట్రియల్ ​ఏరియాలో పీసీబీ అధికారులపై దాడి చేసి ట్యాంకర్‌‌ను ఎత్తుకెళ్లిపోవడమే ఇందుకు తాజా ఉదాహరణ.

ప్రోత్సహిస్తున్న ఫ్యాక్టరీలు..

జీడిమెట్ల, ఐడీఏ బొల్లారం, ఉప్పల్, పటాన్​చెరు, చర్లపల్లి, బాలానగర్, గాంధీనగర్, కూకట్​పల్లి ఇలా పలు ఇండస్ట్రియల్ ఏరియాల్లో వెయ్యికిపైగా ఫార్మా, బల్క్ ​డ్రగ్ ​ఫ్యాక్టరీలు ఉన్నాయి. కాలుష్య తీవ్రత  ఆధారంగా రెడ్, ఆరెంజ్, గ్రీన్​ ఇలా ఈ ఫ్యాక్టరీలను పీసీబీ మూడు వర్గాలుగా డివైడ్ చేస్తుంది.  ఈ ఫ్యాక్టరీలన్నీ కూడా అక్కడ వెలువడే ప్రమాదకర వేస్టేజ్ కెమికల్స్​ను జీడిమెట్లలోని జేఈటీఎల్​లేదా పటాన్​చెరులోని పీఈటీఎల్​శుద్ధి కేంద్రాలకు తప్పనిసరిగా పంపాలి. కానీ కొన్ని కంపెనీలు ఇలా చేయకుండా బయటే పారబోస్తున్నాయి. ఇందుకోసం డంపింగ్​మాఫియాను ప్రోత్సహిస్తున్నాయి. పర్మిషన్ ​ఒకదానికి.. తయారు చేసేది మరొకటి సిటీలోని చాలా ఫ్యాక్టరీలు రూల్స్ పాటించడం లేదనే ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. పర్మిషన్​ తీసుకునేది ఒకదాని కోసమైతే ఉత్పత్తి చేసేవి మాత్రం వేరే వస్తువులు ఉంటున్నాయి. కొన్ని ఫ్యాక్టరీల్లో గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్​తయారు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వేస్టేజ్​ను  శుద్ధి కేంద్రాలకు పంపితే తమ గుట్టు బయటపడుతుందనే భయంతో నాలాలు, ఖాళీ ప్రదేశాల్లో పారబోస్తున్నాయి. ​ఇందుకోసం కొన్ని ఫ్యాక్టరీలు డంపింగ్​ మాఫియాను ఏర్పాటు చేసుకుంటున్నాయి. కాగా ఈ మాఫియా కొంత మంది ప్రజాప్రతినిధులు అండతో రెచ్చిపోతోన్నట్లు సమాచారం. ఎక్కడపడితే అక్కడ ప్రమాదకర కెమికల్స్​ను పారబోస్తున్నారు. ఇలా పార బోస్తూ పలు సందర్భాల్లో అధికారులకు పట్టుపడిన సందర్భాలూ కూడా ఉన్నాయి.

గతంలో జరిగిన ఘటనలు..

జీడిమెట్ల ఇండస్ట్రియల్ ​ఏరియాలో ప్రమాదకర వేస్టేజ్​ను నాలాలో పోస్తుండగా ఐలా అధికారులు పట్టుకున్నారు. వెంటనే డంపింగ్​ మాఫియాకు చెందిన వ్యక్తులు అక్కడికి వచ్చి బెదిరించి ట్యాంకర్​ను​ ఎత్తుకెళ్లారు. ఐడీఏ బొల్లారంలో గస్తీ తిరుగుతున్న పీసీబీ బృందం ఓ ట్యాంకర్​ను పట్టుకుంది. దీంతో కొంత మంది కత్తులతో అధికారుల వెహికల్స్​ను సూరారం వరకు వెంబడించారు. జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలోని నాలాలో కెమికల్​ డంపింగ్​చేస్తున్న ట్యాంకర్​ను పీసీబీ అధికారులు ఇటీవల పట్టుకోగా వారిని కొట్టి ఆ ముఠా ట్యాంకర్​ను​ ఎత్తుకెళ్లింది. 

దాడులకు భయపడం

కాలుష్య నియంత్రణ కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. డంపింగ్ ​మాఫియా దాడులకు భయపడేదిలేదు. పీసీబీ అధికారులపై ఈ దాడులు కొత్తేమీ కాదు. ముఠాలపై కేసులు నమోదు చేస్తున్నాం. ఇండస్ట్రియల్ ఏరియాలో గస్తీ బృందాలను ముమ్మరం చేసి తనిఖీలు చేపడుతాం. రూల్స్ పాటించని కంపెనీలను మూసివేస్తాం.
రాజేందర్, మేడ్చల్​జిల్లా పీసీబీ రీజినల్ ఆఫీసర్