
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దెబ్బకు కుదేలైన స్పోర్ట్స్ పర్సన్.. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు రకరకాల మార్గాలను ఆన్వేషిస్తున్నారు. ఇండియా స్టార్ స్పింటర్ ద్యుతీ చంద్.. తన ట్రెయినింగ్ కోసం బీఎండబ్ల్యూ కారును అమ్మేందుకు సిద్ధమైంది. రూ. 30 లక్షల విలువైన ఈ కారు ఫొటోలను ఫేస్బుక్లో పెట్టింది. కారు కొనాలనుకునేవారు నేరుగా మెసేజ్ చెయ్యాలని పోస్ట్ లో పేర్కొంది. అయితే ద్యుతీని ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకురావాలనే కామెంట్స్ ఎక్కువ అవ్వడంతో ఆ పోస్ట్ ను తర్వాత తొలగించింది. ‘కరోనా మహమ్మారి వల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో నా మీద ఖర్చు చేసేందుకు స్పాన్సర్లు ముందుకు రావడం లేదు. ప్రస్తుతం నేను టోక్యో ఒలింపిక్స్కు సిద్ధమవుతున్నా. ఆ ట్రెయినింగ్ ఖర్చులకు నా దగ్గర డబ్బు లేదు. ప్రస్తుతం ఒడిశా గవర్నమెంట్ కూడా ఆర్థిక కష్టాల్లో ఉంది. అందుకే కారు అమ్ముతున్నా. ఏషియన్ గేమ్స్ లో నేను చూపిన ప్రతిభకు గాను ఒడిశా గవర్నమెంట్ అప్పట్లో నాకు రూ.3 కోట్లు ఇచ్చింది. ఆ డబ్బుతో ఇల్లు కట్టుకున్నా. బీఎండబ్ల్యూ కారు కూడా కొనుగోలు చేశా. ఇది కాకుండా నా దగ్గర మరో రెండు కార్లు కూడా ఉన్నాయి. ఇప్పుడున్న ఇంటిలో మూడో కారుకు పార్కింగ్ ప్లేస్ కూడా లేదు. అందుకే ఒకటి అమ్మేద్దామనుకున్నా’ అని చెప్పుకొచ్చింది. కారు అమ్మితే వచ్చే డబ్బుతో మంచి ట్రెయినింగ్తో పాటు పోషకాహారం కూడా తీసుకుంటానని చెప్పింది. కోచింగ్ సిబ్బంది జీతాలు, డైటిషియను, ఇతర వాటికి నెలకు రూ. 5 లక్షలు ఖర్చువుతున్నాయని ద్యుతీ వెల్లడించింది.
For More News..