న్యూఢిల్లీ: మూడో విడత జరిగిన జేఈఈ మెయిన్ లో అర్హులైన విద్యార్థులు సుప్రీం కోర్టు తలుపుతట్టారు. 2021 జేఈఈ (అడ్వాన్స్) పరీక్షకు తాము హాజరయ్యేందుకు అనుమతిస్తూ ఆదేశాలివ్వాలని పిటిషన్ వేశారు. విద్యార్థుల తరఫున సీనియర్ లాయర్ సుమంత్ వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారించింది.సంబంధిత అధికారులను మీరు సంప్రదించారా ? అని కోర్టు అడుగగా అవునని బదులిచ్చారు పిటిషనర్ల తరపు లాయర్. అయితే ఒక సారి చర్చించి నిర్ణయం తీసుకున్న తరవాత మళ్లీ తాము ఎలా జోక్యం చేసుకుంటామని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. విధానపరమైన నిర్ణయమైతే తాము ఎలా జోక్యం చేసుకోవాలని కోర్టు పేర్కొంది.
సంబంధిత అధికారులతో మాట్లాడకుండా నేరుగా ఉద్దేశ పూర్వకంగా కావాలని కోర్టుకు వచ్చినట్లు తాము అభిప్రాయపడుతున్నామని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఏది ఏమైనా సంబంధిత అధికారులను సంప్రదించమని సుప్రీంకోర్టు సూచించింది. అలాగే జేఈఈ అడ్వాన్స్ దరఖాస్తుకు గడువు తేదీలోపల ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది.