- ఆన్లైన్లోనే వాల్యుయేషన్
- టీఎస్ పీఎస్సీ యోచన
హైదరాబాద్, వెలుగు: గ్రూప్ 1 ఎగ్జామ్స్ను పకడ్బందీగా నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. మెయిన్స్ ను ఎలా నిర్వహించాలనే దానిపై ఫోకస్ పెట్టింది. ఈసారి ఎగ్జామ్ విధానంలో సంస్కరణలు తీసుకురావాలని యోచిస్తోంది. మొత్తం 503 పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వగా, ఇప్పటి వరకు 1.42 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. ఈ నెలాఖరు వరకు అప్లికేషన్లకు గడువు ఉంది. ఆ తర్వాత రెండు నెలల్లో ప్రిలిమ్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కువ మంది అభ్యర్థులు ఉండడంతో గతంలో మాదిరిగానే రాత పరీక్ష నిర్వహించనున్నారు. అయితే మెయిన్స్ కీలకం కావడంతో ఆ పరీక్షపై టీఎస్పీఎస్సీ అధికారులు ఇప్పటి నుంచే దృష్టి సారించారు.
పేపర్ లీక్ కాకుండా...
గతంలో గ్రూప్ 1 మెయిన్స్ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ను ప్రింట్ చేసివ్వగా, ఈసారి ఆ విధానానికి స్వస్తి పలకాలని టీఎస్ పీఎస్సీ భావిస్తోంది. నవంబర్ లేదా డిసెంబర్ లో నిర్వహించనున్న మెయిన్స్ లో ఈ–క్వశ్చన్ పేపర్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ప్రిలిమ్స్ ద్వారా మెయిన్స్కు ఎంపికయ్యేది 25 వేల మందే కావడంతో పెద్దగా ఇబ్బందులు ఉండవని అధికారులు చెబుతున్నారు. ముందుగానే అభ్యర్థులకు కంప్యూటర్లు, ల్యాప్టాప్లు ఏర్పాటు చేసిన సీట్లను కేటాయిస్తారు. ఎవరికి అలాట్ చేసిన సీట్లలో వారు కూర్చుంటేనే, ఆ సిస్టమ్లో క్వశ్చన్ పేపర్ ఓపెన్ అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అభ్యర్థులు సిస్టమ్లో క్వశ్చన్లు చూస్తూ ఆన్సర్లు రాయాల్సి ఉంటుంది. దీని ద్వారా పేపర్ బయటకు రాదని, క్వశ్చన్ పేపర్ లీక్ కాకుండా ఉంటుందని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం రైల్వే పోస్టుల భర్తీకి ఈ విధానమే అమలు చేస్తున్నట్టు పేర్కొంటున్నారు. మరోవైపు ఆన్సర్ షీట్ల వాల్యుయేషన్ కూడా ఆన్లైన్లోనే నిర్వహించాలని టీఎస్ పీఎస్సీ భావిస్తోంది. ఒక్కో ఆన్సర్ షీట్ను ఇద్దరు ప్రొఫెసర్లతో వాల్యుయేషన్ చేయించాలని యోచిస్తోంది.