- జట్లుగా ఏర్పడి గంజాయి కోసం ఫండింగ్
- డెడ్ డ్రాప్ విధానంలో డ్రగ్స్, గంజాయి సరఫరా
- గోవా నుంచి డ్రగ్స్, ఏజెన్సీ నుంచి గంజాయి
- సప్లయర్లు, కస్టమర్ల డేటా ఆధారంగా ఈగల్ ఆపరేషన్స్
హైదరాబాద్, వెలుగు: గంజాయి, డ్రగ్స్ కోసం మత్తు బానిసలు కొత్త తరహా దందాకు తెరతీశారు. జట్లుగా ఏర్పడి గంజాయి కొనుగోలు చేస్తున్నారు. తాము వినియోగించడంతో పాటు గంజాయిని అమ్మి, సొమ్ము చేసుకుంటున్నారు. చైన్ సిస్టమ్లో సాగుతున్న గంజాయి సప్లయ్లో డ్రగ్స్ కూడా పెత్త మొత్తంలో చేతులు మారుతోంది. మాదకద్రవ్యాలను కట్టడి చేయడంతో భాగంగా రాష్ట్ర ఈగల్ (ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్) ఫోర్స్ చేస్తున్న డెకాయ్ ఆపరేషన్స్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఇంజనీరింగ్ విద్యార్ధులు సహా చెడు అలవాట్లకు బానిసలైన యువత క్రౌండ్ ఫండింగ్, డెడ్ డ్రాప్ విధానంలో గంజాయి, డ్రగ్స్ సప్లయ్ చేస్తున్నట్లు ఈగల్ గుర్తించింది. ఒడిశా సహా ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయి, గోవా నుంచి సింథటిక్ డ్రగ్స్ కొనుగోలు చేసి హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో అధిక రేట్లకు విక్రయిస్తున్నట్లు ఈగల్ ఫోర్స్ దర్యాప్తులో బయటపడింది.
గంజాయి కోసం ముఠాలుగా ఏర్పడి
గంజాయి మత్తు కోసం కొంతమంది విద్యార్థులు కలిసి డబ్బులు పోగు చేస్తున్నారు. సిగరెట్లు, మద్యం, గంజాయి, డ్రగ్స్ మత్తుకు అలవాటుపడిన విద్యార్థులు సప్లయర్లుగా మారుతున్నారు. గంజాయి కొనుగోలు, సప్లయ్ కోసం గ్యాంగ్ లుగా ఏర్పడుతున్నారు. ఒక్కొక్కరు రూ.2 వేల నుంచి రూ.10 వేల వరకు ఫండింగ్ చేస్తున్నారు. ఇలా సేకరించిన డబ్బుతో ఒడిశా ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్తున్నారు. అందరూ స్టూడెంట్స్ కావడంతో టూర్స్ పేరిట ఏజెన్సీల్లో చక్కర్లు కొడుతున్నారు. స్థానిక ఏజెంట్ల వద్ద అతి తక్కువ ధరకు కిలో రూ.2 వేల చొప్పున గంజాయి కొనుగోలు చేస్తున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ట్రావెల్ చేస్తున్నారు.
గమ్యస్థానాలకు చేరిన తర్వాత ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కాలేజీల్లో సప్లయ్ చేసేందుకు పర్సుల్లో పెట్టుకుని తిరుగుతున్నారు. ఇలా ఈజీ మనీ కోసం హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ పరిసరాల్లోని ఇంజనీరింగ్ విద్యార్థులకు విక్రయిస్తున్నట్లు ఈగల్ గుర్తించింది.ఈజీ మనీ కోసం అలవాటుపడిన యువత, చిల్లర దొంగలతోపాటు ఒడిశా ఏజెన్సీల నుంచి గంజాయి, గోవా నుంచి డ్రగ్స్ను తరలిస్తున్నారు.
కోడ్స్తో డ్రగ్స్ సప్లయ్, డెలివరీ
‘ఐటమ్’ ‘మాల్’ ‘టికెట్ బుకింగ్’ ‘నైట్ పార్టీ’ సహా అనేక కోడ్స్ ఉపయోగించి డ్రగ్స్, గంజాయిలను చేరవేస్తున్నారు. మార్కెట్లో దాని విలువ ఆధారంగా గోవా నుంచి కొకైన్ , చరాస్, ఎండీఎంఏ సహా సింథటిక్ డ్రగ్స్ హైదరాబాద్కు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు.ఈ మొత్తం వ్యవహారంలో డ్రగ్ డీలర్లు, సప్లయర్ల వివరాలు ఒకరికి ఒకరు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. ఆన్లైన్లోనే ఆర్డర్లు, కొరియర్లలో సప్లయ్ చేస్తూ డెడ్ డ్రాప్ విధానంలో డెలివరీ చేస్తున్నారు.
డ్రగ్స్, గంజాయి పార్సిల్ పెట్టి ఆయా లొకేషన్లను కస్టమర్ల షేర్ చేస్తున్నారు. ఒక్కో గ్రాముకు మత్తును బట్టి రేట్ ఫిక్స్ చేసి కమీషన్లు తీసుకుంటున్నారు. గోవాలో రూ. వెయ్యికి లభించే ఎల్ఎస్డీ బ్లాట్స్ను సిటీకి తరలించి రూ.1,500 నుంచి రూ.-3,000లకు విక్రయిస్తున్నారు. ఎల్ఎస్డీ కంటే ఎక్కువ మత్తును ఇచ్చే హెరాయిన్ను గ్రాము రూ.6 వేల నుంచి 8,500 వరకు విక్రయిస్తున్నారు. ఇప్పటికే పట్టుబడిన గంజాయి, డ్రగ్స సప్లయర్లు, కస్టమర్ల కాల్ డేటా, ఫోన్ నంబర్స్ ఆధారంగా క్యారియర్స్పై ఈగల్ ఆఫీసర్స్ నిఘా పెట్టారు.
