- సంక్రాంతికి చికెన్, మటన్, లిక్కర్, కుక్కర్ కూడా పంపిణీ
యాదాద్రి, వెలుగు : మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనే లేదు. కౌన్సిలర్లుగా పోటీ చేసే ఆలోచనలో ఉన్న వాళ్లు కొన్ని వార్డుల్లో అప్పుడే రంగంలోకి దిగిపోయారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుస్తున్నారు. వారిని మచ్చిక చేసుకోవడానికి సంక్రాంతిని ఫుల్గా వాడేసుకున్నారు. పండుగ పేరుతో లిక్కర్, చికెన్, మటన్తో పాటు కొన్ని చోట్ల కుక్కర్లు కూడా పంపిణీ చేశారు. యాదాద్రి జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో 104 వార్డులున్నాయి. ఫైనల్ లిస్ట్ ప్రకారం 1,32,711 ఓటర్లు ఉన్నారు. ఈ ఆరు మున్సిపాలిటీలోని ఓటర్లలో మహిళలే ఎక్కువగా ఉన్నారు.
పురుషులు 64,926 మంది ఉండగా మహిళలు 67,767 మంది ఉన్నారు. మొత్తంగా 2841 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో 16 మంది ట్రాన్స్జెండర్లు ఉండగా ఆలేరు, భువనగిరిలో ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి ఫైనల్ ఓటర్ లిస్ట్ రిలీజ్ అయింది. వార్డులను కూడా ఫైనల్ చేశారు. ఓవరాల్గా రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. కానీ ఇప్పటివరకూ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కాలేదు. ఏ వార్డు ఏ సామాజిక వర్గానికి రిజర్వేషన్ అయిందో తేలక పోయినా ఆశవహులు మాత్రం టికెట్ ప్రయత్నాలు ముమ్మరం చేయడమే కాకుండా వార్డుల్లో జనాలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు.
మటన్, చికెన్, లిక్కర్ పంపిణీ
పార్టీ టికెట్ తనకే వస్తుందని, మహిళకు రిజర్వేషన్ అయితే తన భార్య లేదంటే కోడలు పోటీ చేస్తారని కొందరు లోకల్ లీడర్లు ప్రచారం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఓటర్లను నేరుగా కలుసుకుంటున్నారు. సంక్రాంతి పండుగ నాడు ఇంటింటికీ కిలో చికెన్, క్వార్డర్ బాటిల్ పంపిణీ చేశారు. మరికొందరు ఇంటికో ఫుల్ బాటిల్ పంపారు. కొందరు తక్కువ రేటున్న లిక్కర్ను పంపిణీ చేయగా వారి ప్రత్యర్థులు ప్రీమియం లిక్కర్పంచారు. పోటాపోటీగా లిక్కర్ పంపకాలతో మున్సిపాలిటీల్లో ముందస్తు ఎన్నికల సందడి కనిపించింది.
యాదగిరిగుట్టలో ప్రతి ఇంటికి మటన్తో పాటు ఫుల్ బాటిల్ లిక్కర్ పంపిణీ చేశారు. అయితే టికెట్ ఆశిస్తున్న ఓ అభ్యర్థి తన పుట్టిన రోజును పురస్కరించుకొని తన వార్డులో రైస్ కుక్కర్లు పంపిణీ చేశారు. రిజర్వేషన్లు, టికెన్ కన్ఫామ్ కాకున్నా ఇలా పోటీలు పడుతూ ఓటర్లను కలుసుకుంటూ ప్రలోభాలకు గురి చేస్తుండడంపై జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
