- రూ.3.75 కోట్ల కొత్త కరెన్సీకి రూ.87.19 లక్షలు కమీషన్
- ముగ్గురికి చెందిన రూ.6.57లక్షలు జప్తు చేసిన ఈడీ
హైదరాబాద్, వెలుగు: నోట్ల రద్దు టైంలో అక్రమాలకు పాల్పడిన పోస్టల్ సిబ్బంది ఆస్తులను ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) అటాచ్చేసింది. హైదరాబాద్ డివిజన్ మాజీ సీనియర్ సూపరింటెండెంట్ కందుల సుధీర్బాబు సహా అతని అనుచరులు వడ్డి నర్సింహారెడ్డి, ఎం.సుదర్శన్కు చెందిన బ్యాంక్ అకౌంట్లలోని రూ.6.57 లక్షలను జప్తు చేసినట్లు ఈడీ అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
నోట్ల రద్దు సమయంలో పోస్టల్ విభాగం సీనియర్ సూపరింటెండెంట్ కె.సుధీర్ బాబు తన పరిధిలోని పోస్ట్ ఆఫీసుల్లో కొత్త కరెన్సీ నోట్లను కమీషన్ల తీసుకుని ఇతరులకు చేరవేశారు. రూ. 3.75 కోట్ల విలువైన కొత్త కరెన్సీ నోట్లు ఇచ్చేందుకు రూ. 87.19 లక్షలు కమీషన్ తీసుకున్నారు. ఈ వ్యవహారంపై హైదరాబాద్ సీబీఐ అధికారులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మనీలాండరింగ్ చట్టాల కింద ఈడీ మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసింది. దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు సుధీర్బాబు బ్యాంకు ఖాతాల్లోని రూ.5.64 లక్షలు, సుదర్శన్ బ్యాంకు ఖాతాలోని రూ.29 వేలు, వడ్డి నర్సింహారెడ్డి అకౌంట్లోని రూ.64 వేలు జప్తు చేశారు.