- అకౌంట్లు ఎన్నున్నయ్... వచ్చే జీతమెంత?
- ప్రవీణ్, రాజశేఖర్ను ఐదు గంటలు విచారించిన ఈడీ
- ఇద్దరూ 2017లోనే టీఎస్పీఎస్సీలో చేరినట్లుగా గుర్తింపు
- చంచల్గూడ జైల్లో ప్రశ్నించిన అధికారులు.. ఇయ్యాల మరోసారి ఎంక్వైరీ
- కమిషన్ చైర్మన్, సెక్రటరీని విచారించే చాన్స్
హైదరాబాద్, వెలుగు: టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్రెడ్డిని సోమవారం చంచల్గూడ జైలులో విచారించింది. ఐదు గంటల పాటు ప్రశ్నించి స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. ఈ ఇద్దర్నీ రెండు రోజుల పాటు విచారించేందుకు కోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు అసిస్టెంట్ డైరెక్టర్స్ సుమిత్ గోయల్, దేవేందర్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలోని నలుగురు సభ్యుల ఈడీ టీమ్.. నిందితుల స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. ఉదయం11.40 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిందితుల తరఫు అడ్వకేట్ల సమక్షంలో ప్రశ్నించింది. ప్రవీణ్, రాజశేఖర్ను విడివిడిగా విచారించి, వీడియో రికార్డింగ్ చేసింది. మనీలాండరింగ్ కోణంలో వివరాలు రాబట్టింది. ఇద్దరికీ బ్యాంక్ అకౌంట్లు ఎన్ని ఉన్నాయని, టీఎస్పీఎస్సీలో ఎట్లా జాయిన్ అయ్యారని, వచ్చే జీతం ఎంత అని ఆరా తీసినట్లు సమాచారం. విచారణ ముగిసిన అనంతరం 40 నిమిషాల పాటు డ్రాఫ్టింగ్ చేసి.. నిందితుల సంతకాలను ఈడీ అధికారులు తీసుకున్నారు.
ప్రవీణ్కు మూడు అకౌంట్లు!
ప్రధానంగా ప్రవీణ్, రాజశేఖర్రెడ్డి వ్యక్తిగత, ఉద్యోగ వివరాలపై ఈడీ అధికారులు ఆరా తీశారు. ఇద్దరి కుటుంబాల నేపథ్యం, ఆర్థిక స్థితిగతుల వివరాలు సేకరించారు. వీరిద్దరూ 2017లోనే టీఎస్పీఎస్సీలో జాయిన్ అయినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. తన తండ్రి హరిశ్చంద్రరావు అడిషనల్ ఎస్పీ హోదాలో పనిచేసి మృతి చెందారని, కారుణ్య నియామకాల్లో భాగంగా టీఎస్పీఎస్సీలో జూనియర్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యానని ఈడీకి ప్రవీణ్ చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా టీఎస్పీఎస్సీ సెక్రటరీకి పీఏగా విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పినట్లు తెలిసింది. ప్రవీణ్కు వచ్చే నెల జీతం, బ్యాంక్ అకౌంట్స్ వివరాలతో ఈడీ అధికారులు స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్లు సమాచారం. ప్రవీణ్కు శాలరీ అకౌంట్తో పాటు మరో రెండు అకౌంట్స్ ఉన్నట్లు తెలిసింది.
ఔట్ సోర్సింగ్లో ఎట్లా జాయిన్ అయ్యారు?
ప్రవీణ్ నుంచి వివరాలు సేకరించిన విధంగానే రాజశేఖర్రెడ్డి వద్ద వివరాలను ఈడీ రాబట్టినట్లు సమాచారం. టీఎస్పీఎస్సీలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా ఎట్లా చేరారనే వివరాలను రాజశేఖర్ నుంచి సేకరించినట్లు తెలిసింది. తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీసెస్ (టీఎస్టీఎస్)లో రిక్రూట్ చేసిన ఏజెన్సీ గురించి ఆరా తీసినట్లు సమాచారం. రాజశేఖర్తో పాటు ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్గా ఇంకా ఎంతమంది టీఎస్పీఎస్సీలో పనిచేస్తున్నారనే వివరాలను ఈడీ అధికారులు సేకరించారు. రాజశేఖర్ దగ్గర రెండు బ్యాంక్ అకౌంట్లు ఉన్నట్లు గుర్తించారు. ప్రవీణ్, రాజశేఖర్ బ్యాంక్ అకౌంట్లకు చెందిన కేవైసీ నంబర్లను కలెక్ట్ చేసినట్లు తెలిసింది. రెండో రోజు విచారణ మంగళవారం కూడా కొనసాగనుంది.
శంకరలక్ష్మి విచారణకు కొనసాగింపుగా..!
కమిషన్ అడ్మిన్ అసిస్టెంట్ సెక్రటరీ సత్యనారాయణ,సెక్షన్ ఆఫీసర్ శంకరలక్ష్మిని గత గురువారం ఈడీ సుమారు 5 గంటల పాటు ప్రశ్నించింది. పేపర్ లీకేజీకి ముందు టీఎస్పీఎస్సీలో ఏం జరిగిందనే వివరాలను సేకరించింది. ఇద్దరి స్టేట్మెంట్లను రికార్డ్ చేసింది. వీరిని కూడా అసిస్టెంట్ డైరెక్టర్ సుమిత్ గోయల్ ఆధ్వర్యంలోని నలుగురు సభ్యుల టీమ్ విడివిడిగా ప్రశ్నించి.. కాన్ఫిడెన్సియల్ సెక్షన్ వివరాలను రాబట్టింది. ఫిబ్రవరి నుంచి మార్చి 31 వరకు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అందించాలని తెలిపింది. వీరిద్దరూ ఇచ్చిన సమాచారం ఆధారంగా మంగళవారం ప్రవీణ్, రాజశేఖర్రెడ్డిని ప్రశ్నించనున్నట్లు సమాచారం. ప్రవీణ్, రాజశేఖర్ స్టేట్మెంట్ల ఆధారంగా టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్రెడ్డి, సెక్రటరీ అనితారామచంద్రన్ను కూడా ఈడీ విచారించనున్నట్లు తెలిసింది.