- వీఎంసీ సిస్టమ్స్కు చెందిన రూ.55.73 కోట్లు జప్తు
- బ్యాంకులను చీట్ చేసిన కేసులోఈడీ చర్యలు
హైదరాబాద్, వెలుగు: మనీలాండరింగ్ కేసులో వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్ కంపెనీకి చెందిన రూ.55.73 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) అధికారులు జప్తు చేశారు. వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్లు 2009 నుంచి 2012 వరకు పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంకు నుంచి పలు దఫాల్లో మొత్తం రూ.1673.52 కోట్ల లోన్ తీసుకున్నారని ఈడీ అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించలేదన్నారు. దీనివల్ల బ్యాంకులు 2018 మార్చి నాటికి మొత్తం రూ.1745.45 కోట్ల నష్టపోయాయని వివరించారు. బ్యాంకులు ఇచ్చిన ఫిర్యాదుతో సీబీఐ బెంగళూరు బ్రాంచ్ అధికారులు కేసు నమోదు చేశారని తెలిపారు.
ఈ క్రమంలోనే మనీలాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. దర్యాప్తులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్ తీసుకున్న రుణాలను దారి మళ్లించడంలో వీ. సతీశ్కుమార్, హిమబిందు, ఆమె సోదరి మాధవి పాత్రపై ఆధారాలు లభించాయన్నారు. దీంతో జూబ్లీహిల్స్లోని సతీశ్కుమార్ ఇంటిని, రాజేశ్ అనే బినామీ పేరిట రంగారెడ్డి జిల్లా అనాజ్పూర్ గ్రామంలో ఉన్న వ్యవసాయ భూమిని, అస్సాంలోని కాచీర్ జిల్లాలో ఎమ్మీల్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ (ఇండియా)ప్రై.లిమిటెడ్ పేరిట ఉన్న రూ.11.37 కోట్ల విలువైన 580.77 ఎకరాల టీ ఎస్టేట్ను జప్తు చేసినట్లు వెల్లడించారు. అదేవిధంగా వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్ పేరిట ఉన్న రూ.37.03 కోట్ల విలువైన ఇతర ఆస్తులు జప్తు చేసినట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు.