వివో కంపెనీపై ఈడీ దాడులు

వివో కంపెనీపై ఈడీ దాడులు

న్యూఢిల్లీ: స్మార్ట్​ఫోన్లు, ఎలక్ట్రానిక్​ ప్రొడక్టులు తయారు చేసే చైనీస్​ కంపెనీ వివో, దీని అనుబంధ సంస్థలకు చెందిన 44 ప్రాంతాల్లో ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ (ఈడీ) మంగళవారం సోదాలు చేసింది. మనీలాండరింగ్​ జరిగినట్టు ఆరోపణలు రావడంతో దాడులు చేశామని ఈడీ ఆఫీసర్లు ప్రకటించారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్​, మేఘాలయ, మహారాష్ట్రతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. ఈ విషయమై వివో ఇంకా రెస్పాండ్​ కాలేదు. ఇటీవల ఢిల్లీ ఎకనమిక్స్​ అఫెన్సెస్​ వింగ్​ పోలీసులు జమ్మూకాశ్మీర్​కు చెందిన ఒక డిస్ట్రిబ్యూటింగ్​ ఏజెన్సీపై ఎఫ్​ఐఆర్​ రిజిస్టర్​ చేశారు. కొందరు చైనీస్​ షేర్​హోల్డర్లు వారి గుర్తింపు డాక్యుమెంట్లను తారుమారు చేశారని ఆరోపించారు. పన్ను చెల్లించని ఆదాయాన్ని విదేశాలకు పంపించడానికి లేదా ఇతర బిజినెస్​లో ఇన్వెస్ట్​ చేయడానికి వీళ్లు పేర్లను తారుమారు చేసి షెల్/పేపర్​ కంపెనీలను తెరిచి ఉంటారని ఈడీ అనుమానిస్తోంది. ఇండియాలో బిజినెస్​ చేస్తున్న చైనీస్​ కంపెనీలు సీరియస్ ​ఫైనాన్షియల్​ క్రైమ్స్​ చేస్తున్నాయని ఆరోపణలు రావడంతో గతంలోనూ ఇలాంటి దాడులు జరిగాయి. ఫారిన్​ ఎక్స్ఛేంజ్​ మేనేజ్​మెంట్​ యాక్ట్​ (ఫెమా) రూల్స్​ను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ ఈడీ ఈ ఏడాది ఏప్రిల్​లో షావోమీకి చెందిన రూ.5,551 కోట్ల విలువైన డిపాజిట్లను సీజ్​ చేసింది. మరో చైనీస్​ కంపెనీ హువావే ఖాతాపుస్తకాలను తారుమారు చేసిందని ఆరోపిస్తూ ఐటీశాఖ ఇదే ఏడాది ఫిబ్రవరిలో దాడులు జరిపింది. షావోమీ, ఒప్పో, వివోతో సహా అనేక చైనీస్ స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్ కంపెనీలు, వాటి డిస్ట్రిబ్యూటర్ల ఆఫీసులపై కిందటి ఏడాది డిసెంబర్‌‌‌‌లో  ఐటీ   దాడులు నిర్వహించింది.