- విదేశాల నుంచి ఐబొమ్మ ఆపరేషన్
- కేసు వివరాలను ఆరా తీస్తున్న ఈడీ అధికారులు
- త్వరలో సైబర్ క్రైమ్ పోలీసులకు లెటర్
హైదరాబాద్, వెలుగు: టాలీవుడ్, బాలీవుడ్ సినిమాలను పైరసీ చేసిన ఐబొమ్మ రవి(ఇమ్మడి రవి) కేసుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఫోకస్పెట్టింది. ఐబొమ్మ, బెట్టింగ్ యాప్స్ ద్వారా జాయింట్గా జరిపిన మనీలాండరింగ్ గుట్టువిప్పేందుకు రెడీ అయింది. ఈ మేరకు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కింద ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్(ఈసీఐఆర్) ఫైల్ చేసేందుకు ఈడీ ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే హైదరాబాద్ సీపీ సహా సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు లెటర్ రాయనున్నట్లు హైదరాబాద్ జోనల్ ఈడీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
ఎఫ్ఐఆర్, నిందితుడు ఇమ్మడి రవి రిమాండ్ రిపోర్ట్ సహా సైబర్ క్రైమ్ పోలీసులు ఫ్రీజ్ చేసిన రూ.3.5 కోట్లకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు, క్రిప్టో వ్యాలెట్ ట్రాన్సాక్షన్ల ఆధారంగా కేసు నమోదు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తామని తెలిపారు. ఐబొమ్మ సహా పలు పైరసీ సైట్లను విదేశాల నుంచి ఆపరేట్ చేయడంతో పాటు క్రిప్టో రూపంలో మనీలాండరింగ్ జరిగిందనే సమాచారం మేరకు సిటీ సైబర్ క్రైమ్ పోలీసుల నుంచి రికార్డులు సేకరిస్తామన్నారు.
ఐబొమ్మ, బెట్టింగ్ యాప్స్తో మనీ లాండరింగ్
ఐబొమ్మతో పాటు బెట్టింగ్ యాప్స్ నుంచి ప్రకటనల రూపంలో రవికి వచ్చి సొమ్మును క్రిప్టో కరెన్సీ రూపంలో విదేశాలకు, అక్కడి నుంచి ఇండియాకు మనీలాండరింగ్ చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తులో ఇప్పటికే బయటపడింది. ఐబొమ్మ సైట్లతో బెట్టింగ్ యాప్స్ను లింక్ చేయడం ద్వార యాడ్స్ రూపంలో అక్రమంగా పెద్ద ఎత్తున డబ్బు సంపాదించినట్టు తేలింది.
ప్రధానంగా నాలుగు బ్యాంకు అకౌంట్లలో రూ.20 కోట్ల లావాదేవీలు జరిగినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. యాడ్స్ ద్వారా వచ్చిన డబ్బుతో హైదరాబాద్, కరీబియన్ దీవుల్లో రవి ఇండ్లు కొనుగోలు చేసినట్టు సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. దీంతో ఐబొమ్మ పైరసీల ద్వారా భారీగా మనీలాండరింగ్ జరిగినట్లు ఆధారాలు లభించడంతో ఈడీ రంగంలోకి దిగనుంది.
