
హైదరాబాద్ సిటీ, వెలుగు: నాణ్యమైన విద్యతోనే ఉన్నత లక్ష్యాలు సాధ్యమని, విద్య విలువైన సంపదని హైదరాబాద్ కలెక్టర్ హరిచందన తెలిపారు. ఎడ్యుకేషనల్ టూర్లో భాగంగా శనివారం హైదరాబాద్ జిల్లా పరిధిలోని ఐదు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు కలెక్టరేట్ను సందర్శించి, కలెక్టర్తో ముఖాముఖి నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు కలెక్టర్తో ఆత్మీయంగా మాట్లాడగా, ఆమె వారి ఉత్సాహాన్ని అభినందించి, జిల్లా పరిపాలన విభాగాల పనితీరును వివరించారు. విద్యార్థుల అభిప్రాయాలు, సూచనలను ప్రోత్సహించి, నేర్చుకున్న విషయాలను ఇతరులతో పంచుకోవాలని సూచించారు. ఎడ్యుకేషనల్ టూర్స్ ద్వారా అనుభవపూర్వక అభ్యాసం విద్యార్థులలో పరివర్తన తెస్తుందన్నారు.
కలెక్టర్కు ప్రమిదలు ఇచ్చిన దివ్యాంగ విద్యార్థులు
దీపావళి పండుగ సందర్భంగా స్వయంగా తయారు చేసిన ప్రమిదలు ఎంతో సంతోషాన్నిస్తున్నాయని కలెక్టర్ హరిచందన దాసరి అన్నారు. శనివారం కలెక్టరేట్లోని తన చాంబర్లో దివ్యాంగ విద్యార్థులు తయారు చేసిన ప్రమిదలను కలెక్టర్కు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారి ప్రతిభను అభినందించి, దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.