చైర్‌‌పర్సన్‌ ఎవరు..?మూడింటిలో ముందే ఓకే

చైర్‌‌పర్సన్‌ ఎవరు..?మూడింటిలో ముందే ఓకే
  • భువనగిరి.. మోత్కూరు.. చౌటుప్పల్​లో ఉత్కంఠ
  • పరిశీలనలో పలువురి పేర్లు 
  • క్యాంపులోనే కొనసాగుతున్న కౌన్సిలర్లు

యాదాద్రి, వెలుగు :  మున్సిపాలిటీల ఫలితాలు వచ్చేశాయి. పార్టీల బలాబలాలు తేలిపోయాయి. అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్​ జెండా ఎగురవేసింది. కౌన్సిలర్లు అందరూ క్యాంపుల్లోనే ఉన్నారు.  చైర్‌‌పర్సన్​ల ఎంపికపై కసరత్తు సాగుతోంది. ఎక్స్​అఫిషియో ఓట్లు అవసరం లేకుండానే  చైర్‌‌పర్సన్​, వైస్​ చైర్‌‌పర్సన్​ ఎంపిక జరగనుంది.

ఎన్నికలకు మందే జిల్లాలోని ఆలేరు, యాదగిరిగుట్ట, భూదాన్​ పోచంపల్లి మున్సిపాలిటీల్లో చైర్​పర్సన్స్​లను డిక్లేర్​ చేశారు.  ఆలేరు చైర్‌‌పర్సన్​గా బీజని బాలమణి, యాదగిరిగుట్టకు గుండ్లపల్లి వాణి, భూదాన్​ పోచంపల్లికి తడక వెంకటేశ్‌ను ఎమ్మెల్యేలు బీర్ల అయిలయ్య, కుంభం అనిల్​కుమార్​ రెడ్డి ప్రకటించారు. వీటిలో యాదగిరిగుట్ట వైస్​ చైర్‌‌పర్సన్​గా ముక్కర్ల మల్లేశ్‌ను ప్రకటించారు. ఆలేరు వైస్​ చైర్మన్‌గా ఎస్సీ లేదా ఎస్టీ  కేటగిరీ నుంచే ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.  భూదాన్​ పోచంపల్లి వైస్​చైర్మన్​ఎంపికపై కసరత్తు కొనసాగుతోంది. 

ఆ మూడింటిలో ఎవరో..

భువనగిరి, చౌటుప్పల్​ మున్సిపాలిటీ  చైర్‌‌పర్సన్​పదవులు జనరల్​మహిళకు, మోత్కూరు ఎస్సీ మహిళకు రిజర్వ్​ అయ్యాయి.  భువనగిరిలో 35, 29 వార్డుల కౌన్సిలర్లు తంగెళ్లపల్లి శ్రీవాణి, పోతంశెట్టి మంజులతో పాటు 11 వ వార్డు కౌన్సిలర్ ​గంజి  శ్రీవాణి సహా మరికొందరు ఆశిస్తున్నారు.  జనరల్​మహిళ అయినందున ఓసీకి ఇవ్వాలా..?  బీసీకి ఇవ్వాలా అన్న అంశంపై చర్చ నడుస్తోంది. చైర్‌‌పర్సన్​ ఎంపికపై భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్​కుమార్​ రెడ్డి ఆచితూచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.  చౌటుప్పల్​ మున్సిపాలిటీ కూడా జనరల్​ మహిళ అయినందున కాసర్ల మంజుల రెడ్డి, బీసీ సామాజిక వర్గాల నుంచి మోగుదాల పావని, బత్తుల వాణి విప్లవ్ ఆశిస్తున్నారు. 

ఈ ముగ్గురిలో చైర్‌‌పర్సన్​ పదవికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి ఎవరిని ఎంపిక చేస్తారన్న అంశంపై అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అదే విధంగా ఆయా మున్సిపాలిటీల్లో వైస్​ చైర్​పర్సన్​ల ఎంపికపై చర్చలు నడుస్తున్నాయి.  మోత్కూరు చైర్‌‌పర్సన్‌ పదవి కోసం రిజర్వ్​వార్డు నుంచి 2వ వార్డు కౌన్సిలర్ ​కుర్మిల్ల ప్రమీల, 6వ వార్డు గడ్డం స్వప్న, జనరల్ వార్డు 12 నుంచి గెలిచిన మెంట రమణ ఆశిస్తున్నారు.  వీరిలో ఎవరిని ఎంపిక చేయాలన్న అంశంపై చర్చలు కొనసాగుతున్నాయి. చైర్‌‌పర్సన్​గా గడ్డం స్వప్న, వైస్ చైర్‌‌పర్సన్‌గా ​గా శ్రీవిద్యను ఎంపిక చేయాలని ఎమ్మెల్యే మందుల సామెల్​ భావిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. భువనగిరి ఎంపీ చామల కిరణ్​కుమార్​ రెడ్డి మాత్రం చైర్​ పర్సన్​గా మెంట రమణ, వైస్​ చైర్​పర్సన్​గా బీసు శ్రీకాంత్​ను సూచిస్తున్నట్టుగా కాంగ్రెస్​లో చర్చ జరుగుతోంది. 

కౌన్సిలర్లు అందరూ క్యాంప్​లోనే

పోచంపల్లి మున్సిపాలిటీలో గెలిచిన ఇండిపెండెంట్​ కూడా కాంగ్రెస్​ క్యాంపులో చేరిపోయారు. దీంతో అక్కడ కూడా ఎక్స్​అఫిషియో ఓటు అవసరం లేకుండానే చైర్‌‌పర్సన్​ ఎన్నిక జరగనుంది. ఆరు మున్సిపాలిటీలకు చెందిన కాంగ్రెస్​ కౌన్సిలర్లు అందరూ క్యాంపులోనే కొనసాగుతున్నారు. వీరందరూ ఈ నెల 16న నేరుగా ఆయా మున్సిపాలిటీలకు వచ్చి చైర్మన్​ ఎన్నిక కోసం నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు.