
- డీఈవోల మీటింగ్లో విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు విద్యాసంస్థల్లో చేరిన విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా ఆదేశించారు. బుధవారం ఎంసీఆర్ హెచ్ఆర్డీలో డీఈఓలతో ఆమె సమావేశమయ్యారు. జిల్లాల పర్యటనల్లో గుర్తించిన పాజిటివ్, నెగెటివ్ అంశాలను వివరించారు. అనంతరం యోగితారాణా మాట్లాడుతూ.. పిల్లలకు టెస్ట్ బుక్స్, నోట్ బుక్స్, యూనిఫామ్ అందించినా ఆ వివరాలను ఇంకా ఎందుకు ఆన్లైన్లో అప్లోడ్ చేయలేదని అధికారులను ప్రశ్నించారు.
వెంటనే అప్డేట్ చేయాలని సూచించారు. కొత్త స్కూళ్లను ఏర్పాటు చేయకపోవడంపై మండిపడ్డారు. పిల్లల ఎఫ్ఆర్ఎస్ కూడా సగం వివరాలే అందింస్తున్నారని, ఇది సరికాదన్నారు. టాయిలెట్లు లేవని, నీళ్లు లేవని ఫెసిలిటీస్ డేటాలో పేర్కొంటున్నారని.. వాస్తవంగా ఉన్నాయో లేవో అనే వివరాలను డీఈవోలు ఫీల్డ్ విజిట్ చేయాలని ఆదేశించారు. తప్పుడు రిపోర్టులు ఇస్తే చర్యలు తీసుకోవాలన్నారు. సర్కారు విద్యాసంస్థల్లో ఎన్రోల్ మెంట్ పెంచేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ప్రభుత్వ సలహాదారు కేశవరావు మాట్లాడుతూ.. తెలంగాణలోని ప్రతి స్టూడెంట్ కు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. యూడైస్, అపార్, ఎఫ్ఎల్ఎన్, ఎల్ఐపీ, నాస్ సర్వే వివరాలపై చర్చించారు. సమావేశంలో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్, అడిషనల్ డైరెక్టర్లు రాధారెడ్డి, శ్రీహరి, ఉషారాణి, రమేశ్, వెంకటనర్సమ్మ తదితరులు పాల్గొన్నారు.