హైదరాబాద్, వెలుగు: పేద, ధనిక తేడా లేకుం డా దేశంలోని ప్రతి విద్యార్థికి ఒకే విద్యావిధానం అమలు చేయాలని కేంద్రాన్ని విద్యావేత్త ప్రొఫెసర్ హరగోపాల్ కోరారు. విద్యార్థి వ్యతిరేక విధానాలను అడ్డుకుని..శాస్త్రీయ విద్యా విధానం కోసం ఉద్యమించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం ఆయన హైదరాబాద్లో పీడీఎస్యూ రాష్ట్ర స్థాయి వర్క్ షాప్కు హాజరై , మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యను వ్యాపారంగా మారుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది దేశానికి ప్రమాదకరమన్నారు. పేదలకు ఉన్నత విద్యను దూరం చేసేందుకు కుట్ర చేస్తున్నాయని, అందుకే విదేశీ, ప్రైవేటు వర్సిటీలను తీసుకొస్తున్నారని మండిపడ్డారు. చరిత్రను వక్రీకరించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నూతన జాతీయ విద్యావిధానం-2020ని అమలు పరుస్తోందని ఫైర్ అయ్యారు.

