
- పోషకాహార లోపం లేకుండా జాగ్రత్తలు
- కేంద్రాల్లో 57 రకాల ఆట వస్తువులు
- ప్లే స్కూల్స్ కు దీటుగా మార్పు
- చిన్నారులకు సీతక్క గుడ్ న్యూస్
- సెల్ఫీ విత్ అంగన్వాడి సక్సెస్ చేయాలి
- గర్భిణులు, బాలింతల కోసం బెంచీలు
- సెంటర్లకు అధునాతన మొబైల్స్
హైదరాబాద్: రాష్ట్రంలోని అంగన్ వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ఎగ్ బిర్యానీ అందించనున్నారు. వారానికి రెండు, మూడు సార్లు వడ్డించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఇస్తున్న భోజనాన్ని మరింత రుచికరంగా అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ విషయాన్ని పంచాయతీరాజ్, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క చెప్పారు.
ఇవాళ రాజేంద్ర నగర్ లో నిర్వహించిన తెలంగాణ గ్రామీణ అభివృద్ధి సంస్థలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మేధోమధన సదస్సులో ఆమె మాట్లాడారు. చిన్నారుల్లో పోషకాహార లోపం లేకుండా చర్యలు తీసుకోనున్నట్టు ఆయన తెలిపారు. బడి గంట తరహాలో అంగన్వాడి కేంద్రాల్లోనూ బెల్సును తీసుకురావాలని సూచించారు. ఉదయం గంటను మోగించడం ద్వారా చిన్నారుల్లో ఉత్సాహం క్రమశిక్షణ పెరుగుతాయని అన్నారు.
అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు సకాలంలో వచ్చేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు. పిల్లలు ఉల్లాసంగా గడిపేలా 57 రకాల ఆటవస్తువులను అంగన్ వాడీ కేంద్రాల్లో అందుబాటులో పెడతామని తెలిపారు. అంగన్వాడి టీచర్లు హెల్పర్ల పని ఒత్తిడిని తగ్గించేందుకు త్వరలో 14 వేల ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ మూలంగా కాస్త ఆలస్యమైందని, త్వరలో ఆ పోస్టులను భర్తీ చేస్తామని అన్నారు.
అంగన్ వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణీలు, బాలింతలు నేల మీద కూర్చోవడానికి ఇబ్బందులు పడుతున్నారని వారి ఇబ్బందులను తొలగించేందుకు అంగన్వాడి కేంద్రాలకు బెంచీలను సరఫరా చేస్తామన్నారు. అంగన్వాడి టీచర్లు ప్రస్తుతం వినియోగిస్తున్న మొబైల్ స్థానంలో అధునాతన మొబైల్స్ ను త్వరలో అందజేస్తామన్నారు.
అంగన్వాడి కేంద్రాలను అక్షర జ్ఞానానికి, పోషకాహారానికి, ఆరోగ్యానికి, ఆటవిడుపునకు, మేధో వికాసానికి కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నామని వివరించారు. అంగన్ వాడీ కేంద్రాలను ప్లే స్కూల్స్ దీటుగా తీర్చిదిద్దబోతున్నట్టు ఆమె వివరించారు. అంగన్వాడీ కేంద్రాలకు నాసిరకం సరుకులు సరఫరా చేసే సప్లయర్స్ ను బ్లాక్ లిస్టులో పెడుతున్నామని మంత్రి వివరించారు.
ఇందిరమ్మ అమృతం ద్వారా కౌమార బాలికలకు పోషకాలతో కూడిన చిక్కిలను పంపిణీ చేస్తున్నామని వివరించారు. అంగన్వాడీలు అందుతున్న సేవలను క్షేత్రస్థాయిలో ప్రజలకు తెలిసేలా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సెల్ఫీ విత్ అంగన్వాడీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. అడ్మిషన్లు పెంచేందుకు అమ్మమాట అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు.