జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇవన్నీ మొదటిసారే

జూబ్లీహిల్స్  ఎన్నికల్లో ఇవన్నీ మొదటిసారే
  • ప్రతీ కేంద్రం వద్ద మొబైల్ డిపాజిట్ సెంటర్

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఈసారి జూబ్లీహిల్స్​నియోజకవర్గంలో ఎన్నికల కమిషన్​కొన్ని అంశాలను మొదటిసారి అమల్లోకి తీసుకువచ్చింది. ఓటర్లలో గందరగోళాన్ని నివారించడానిక వీవీఎంలపై  అభ్యర్థుల పేర్లతో పాటు వారి  కలర్ ఫొటోలను ప్రింట్​చేయించింది. దీనివల్ల ఒకే పేరుతో ఉన్న అభ్యర్థులను గుర్తించేందుకు ఇబ్బందులు ఏర్పడలేదు. కలర్ ఫొటో ఉండడంతో అభ్యర్థిని గుర్తుపట్టేందుకు ఈజీగా ఉందని ఓటర్లు తెలిపారు. 

పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతను పర్యవేక్షించేందుకు వినూత్నంగా డ్రోన్ కెమెరాలను వినియోగించారు. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాలు, పోలింగ్ కేంద్రాల చుట్టూ ఉన్న పరిసరాలను డ్రోన్ల ద్వారా మానిటరింగ్ చేసి, శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. ఇక ప్రతిసారి సెల్ ఫోన్లతో వస్తే అనుమతి ఇవ్వకపోయేవారు. దీంతో కొందరు ఓటు వేయకుండానే తిరిగి వెళ్లిన సందర్భాలున్నాయి. 

అయితే, ఈ సారి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు మొబైల్ డిపాజిట్ సెంటర్లను ఏర్పాటు చేశారు. దీంతో ఓటర్లకు ఇబ్బందులు తప్పాయి. ఓటర్లు తమ పేరు ఏ పోలింగ్ కేంద్రంలో ఉందో, ఏ బూత్‌‌‌‌‌‌‌‌లో ఓటు వేయాలో తెలుసుకోవడానికి వీలుగా ప్రతీ స్టేషన్ వద్ద ఓటర్ అసిస్టెన్స్ బూత్‌‌‌‌‌‌‌‌లను  కూడా ఏర్పాటు చేశారు. ఓటర్లు ఎక్కువ సమయం వినియోగించుకునేలా పోలింగ్ సమయాన్ని పొడిగించారు.

 పోలింగ్​ను మొదటిసారిగా ఒక గంట ఎక్కువగా పొడిగించారు. దీంతో చాలామంది సాయంత్రం ఆఫీసుల నుంచి ఇతర డ్యూటీలు చేసేవాళ్లు సాయంత్రం ఓటు వేశారు. చివరి గంట సమయం చాలా మందికి ఉపయోగపడింది.